మోక్షం పేరుతో యువకుని సజీవ సమాధి యత్నం... పోలీసుల రాకతో...

ABN , First Publish Date - 2022-09-28T17:17:13+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మూఢనమ్మకాలతో...

మోక్షం పేరుతో యువకుని సజీవ సమాధి యత్నం... పోలీసుల రాకతో...

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మూఢనమ్మకాలతో 22 ఏళ్ల యువకుడు మోక్షం పొందేందుకు నలుగురు పూజారుల సాయంతో ఆలయం సమీపంలో సజీవ సమాధి అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సమాధి పైనున్న మట్టిని తొలగించి, ఆ యువకుడిని బయటకు తీసుకువచ్చి, అతని ప్రాణాలు కాపాడారు. ఈ యువకుడు సజీవ సమాధి అయ్యేందుకు సహకరించిన నలుగురు పూజారులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. 




ఆ యువకుడు ఈ సమాధిలో 7 నిముషాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన అసీవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాంగర్మవూ సీఓ పంకజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ 22 ఏళ్ల శుభం అనే యువకుడు గ్రామంలోని ఆలయం సమీపంలో సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించాడనే సమాచారం తమకు వచ్చిందన్నారు. వెంటనే తాము తమ బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. నలుగురు పూజారులు ఆ యువకునిపై మట్టిపోశారని, తాము వెంటనే దానిని తొలగించి, ఆ యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా శుభమ్ మాట్లాడుతూ తాను మోక్షం కోరుకుంటున్నానని, నవరాత్రులలో సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. కాగా శుభమ్ గత కొన్నేళ్లుగా కాళీమాత ఆరాధన చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-28T17:17:13+05:30 IST