కాలేజీలో ఘోరం: తోటి విద్యార్థినిని నేలపై పడేసి...

ABN , First Publish Date - 2021-10-01T22:36:12+05:30 IST

ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులో వారిద్దరూ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరి మధ్య

కాలేజీలో ఘోరం: తోటి విద్యార్థినిని నేలపై పడేసి...

కొచ్చి: ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులో వారిద్దరూ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరి మధ్య చనువు ఉంది. కానీ, అంతలోనే ఏమైందో ఏమో? ఈ ఉదయం సప్లిమెంటరీ పరీక్షలు రాసి బయటకు వచ్చిన ఆమెపై ఒక్కసారిగా అతడు దాడిచేశాడు. కిందపడేసి గొంతుపట్టుకుని బ్లేడుతో తెగ్గోశాడు. ఆమె బాధతో విలవిల్లాడుతూ కాలేజీ ఆవరణలోనే ప్రాణాలు విడిచింది. కేరళలోని కొట్టాయం జిల్లా పాలాలోని ఓ కళాశాలలో ఈ ఉదయం జరిగిందీ దారుణం.


బాధితురాలు నితినమోల్‌ (22) కళాశాల నుంచి బయటకు రాగానే, నిందితుడు అభిషేక్ బైజు ఆమెను అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆపై కోపంతో ఊగిపోయిన అభిషేక్ ఆమెను కిందకు తోసి గొంతు నొక్కి పట్టాడు. అనంతరం జేబులోంచి బ్లేడు తీసి గొంతును తెగ్గోశాడు. రక్తమోడుతున్న బాధితురాలు వేస్తున్న కేకలు గమనించిన ఇతర విద్యార్థులు, స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 


ఘటనపై కాలేజీ సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. కాలేజీ ఆవరణలో యువతీయువకులిద్దరూ గొడవ పడుతుండడాన్ని తాను చూశానని తెలిపాడు. కాసేపటి తర్వాత అతడు ఆమెను కిందపడేసి గొంతుపట్టుకున్నాడని, అప్పుడు అతడి చేతిలో బ్లేడ్ ఉన్న విషయాన్ని తాను గుర్తించలేదన్నాడు. ఆ తర్వాత క్షణాల్లోనే ఆమె మెడనుంచి రక్తం కారుతుండడాన్ని గమనించి ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు చెప్పాడు. నిందితుడుని పట్టుకున్న స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. 


బాధిత విద్యార్థినిది నిథినమోల్ తలయోలపరంబు కాగా, నిందితుడు అభిషేక్‌ది ఎర్నాకుళం సమీపంలో కూతట్టుకులమ్. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో ఇద్దరూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అతడి చేష్టలు మితిమీరడంతో ఆమె కాస్తంత దూరం పెట్టిందని, అది తట్టుకోలేకే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని, స్థిమిత పడ్డాక విచారించి వివరాలు రాబడతామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-01T22:36:12+05:30 IST