27న మంత్రివర్గ సమావేశం
ABN , First Publish Date - 2022-06-22T13:07:43+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 27న భేటీ కానుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నట్లు
చెన్నై, జూన్ 21: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 27న భేటీ కానుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపారు. సచివాలయంలోని నామక్కల్ కవీంజర్ మాలిగైలో జరుగనున్న సమావేశానికి మంత్రులందరూ హాజరుకావాలని ఇప్పటికే సీఎం కార్యాలయం నుంచి ఆహ్వానం వెళ్లింది. రాష్ట్రంలో రోజురోజుకు ఆన్లైన్ రమ్మీ కారణంతో దుష్ఫలితాలు పెరిగిపోతున్నాయి. రమ్మీ బాధితుల ఆత్మహత్యలూ పెరుగుతున్నాయి. దీంతో దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నివేదికపై ఈ క్యాబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మెకెదాటు ఆనకట్టపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేగాక ఇటీవల దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడ వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో భేటీ అయి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఆ పారిశ్రామికవేత్తలకు సులభపద్ధతిలో అనుమతులివ్వడం, స్థలాలను ఎంపిక చేయడంతో పాటు తగిన సదుపాయాలు కల్పించడంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ ఏర్పాట్లపైనా ఈ సమావేశంలో సమీక్ష జరుపనున్నారు. అదే విధంగా రుతుపవన వర్షాల ప్రభావంతో తలెత్తే సమస్యలను అధిగమించడంపైనా, తీసుకోవాల్సిన చర్యలపైన కూడా సీఎం మంత్రులతో చర్చించనున్నారు. చివరిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 5న జరిగింది. ఆ తరువాత జరుగుతున్న మంత్రివర్గ సమావేశం ఇదే కావడంతో ప్రాధాన్యత నెలకొంది.