210 కేసులు.. ఐదుగురు మృతి
ABN , First Publish Date - 2021-06-15T06:00:56+05:30 IST
210 కేసులు.. ఐదుగురు మృతి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా సోకి జిల్లాలో సోమవారం ఐదుగురు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 4,309 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 210 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31, విజయవాడ గ్రామీణ డివిజన్లో 20, నూజివీడు డివిజన్లో 95, మచిలీపట్నం డివిజన్లో 17, గుడివాడ డివిజన్లో 46 మందికి వైరస్ సోకింది. ఇతర జిల్లాలకు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్గా తేలింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య అధికారికంగా 1,037కు పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసులు 95,853కు చేరాయి. వీరిలో ఇప్పటివరకు 88,121 మంది కోలుకుని ఇళ్లకు చేరుకోగా, 6,695 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
1,727 పడకలు ఖాళీ
జిల్లాలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుం డటంతో కొవిడ్ ఆసుపత్రుల్లో బాధితుల రద్దీ తగ్గింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ బెడ్స్తో పాటు ఆక్సిజన్, సాధారణ పడకలు కలిపి 1,727 ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ, 18 ఆరోగ్యశ్రీ, 15 నాన్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు కలిపి మొత్తం 44 ఆసుపత్రుల్లో మొత్తం ఐసీయూ బెడ్స్ 497 ఉండగా, సోమవారం 44 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ మొత్తం 1,832 ఉండగా, 702 బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి. సాధారణ పడకలు 1,255 ఉంటే, 981 ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 6 కొవిడ్ కేర్ సెంటర్లలో 3,036 బెడ్స్ ఉండగా, కేవలం 131 మంది పాజిటివ్ బాధితులే ఉన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 4,707 మంది పాజిటివ్ బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతుండగా, 25,834 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 12,13,257 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో మొదటి డోస్ తీసుకున్న వారు 9,55,481 మంది కాగా, 2,57,776 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.