పాపను డబ్బాలో పెట్టి గంగానదిలో పారేశారు.. దేవుళ్ల ఫొటోలు.. జాతక చక్రంతో సహా..

ABN , First Publish Date - 2021-06-17T16:50:54+05:30 IST

మహాభారతంలోని కర్ణుడి స్టోరీ చెబుతున్నారేంటని అనుకుంటున్నారా..? కాదు, ఇది భారతం నాటి స్టోరీ కాదు. ఈ టెక్ యుగంలోనే జరిగిందీ ఘోరమైన ఘటన. ముక్కుపచ్చలారని చిన్నారిని పెట్టెలో పెట్టి నదిలో వదిలేశారు.

పాపను డబ్బాలో పెట్టి గంగానదిలో పారేశారు.. దేవుళ్ల ఫొటోలు.. జాతక చక్రంతో సహా..

ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా నదిలో నీటిపై ఓ డబ్బా తేలుతూ రావడం అతడికి కనిపించింది. ఏంటా అని ఆ డబ్బాను తీసుకుని తెరచి చూస్తే అందులో ఓ పసికందు కనిపించింది. ఆ డబ్బాలోనే దేవుళ్ల ఫొటోలతోపాటు, ఆ పసికందు జన్మనక్షత్రం జాతక వివరాలన్నీ ఉన్నాయి. స్వయంగా గంగమ్మ తల్లే తమకు బిడ్డను ప్రసాదించిందని నమ్మాడతడు. ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్లాడు. ఏంటీ, మహాభారతంలోని కర్ణుడి స్టోరీ చెబుతున్నారేంటని అనుకుంటున్నారా..? కాదు, ఇది భారతం నాటి స్టోరీ కాదు. ఈ టెక్ యుగంలోనే జరిగిందీ ఘోరమైన ఘటన. ముక్కుపచ్చలారని చిన్నారిని పెట్టెలో పెట్టి నదిలో వదిలేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గాజీపూర్‌లో గంగానదీ దాద్రీ ఘాట్ సమీపంలో మంగళవారం సాయంత్రం నీటిపై తేలుతూ ఓ డబ్బా కనిపించింది. ఆ డబ్బాలోంచి ఓ పాప ఏడుపులు వినిపించాయి. ఆ డబ్బాకు దగ్గరలోనే ఉన్న ఓ బోటు యజమాని మల్లాహ్ గుల్లు దాన్ని గమనించాడు. వెంటనే డబ్బాను చేతుల్లోకి తీసుకున్నాడు. తెరచి చూశాడు. అతడి కళ్లను అతడే నమ్మలేకపోయాడు.  డబ్బాలో ఓ పాప కనిపించింది. అదే డబ్బాలో హిందూ దేవుళ్ల ఫొటోలు, ఆ పాప జాతకం అన్నీ ఉన్నాయి. ఓ తెల్లటి కాగితంపై ఈ పాప పేరు గంగ అని కూడా రాసిపెట్టారు. దీంతో ఆ పాపను ఆ బోటు యజమాని తన ఇంటికి తీసుకెళ్లాడు. 


భార్య సాయంతో స్నానం చేయించి ఆ పాప ఆకలిని తీర్చారు. గంగమ్మ తల్లే మాకు ఆ బిడ్డను ప్రసాదించిందనీ, ఆ పాపను తామే పెంచుకుంటామని గుల్లు దంపతులు ఆశించారు. కానీ ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి పోలీసులకు తెలియడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు వచ్చి ఆ పాపను స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ పాప పుట్టి 21 రోజులే అయి ఉంటుందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పాప తల్లిదండ్రులు ఎవరో, ఆ పాపను ఎవరు నదిలో వదిలి పెట్టారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా చిన్నారి సంరక్షణ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వానివే అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం గమనార్హం. పాపను సకాలంలో రక్షించిన సంరక్షించిన బోటు యజమానిని కూడా ఆయన ప్రశంసించారు. అతడు మానవత్వానికి ప్రతీక అని కొనియాడారు.

Updated Date - 2021-06-17T16:50:54+05:30 IST