ఎప్పటికి పూర్తయ్యేనో..!

ABN , First Publish Date - 2021-01-09T05:00:36+05:30 IST

మారుమూల ఉండే గ్రామాలను సైతం జిల్లాలోని ప్రధాన రహదారులకు అనుసంధానం చేసి ఆయా గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో 203 పనులను ఎంపిక చేశారు. ఈ పనులకు రూ.263.56 కోట్ల నిధులను గత ప్రభుత్వం కేటాయించింది.

ఎప్పటికి పూర్తయ్యేనో..!
పర్చూరు ప్రాంతంలో వేస్తున్న రహదారి

 203 రహదారుల నిర్మాణానికి 2018లో నిధుల కేటాయింపు

ఇప్పటికి తొమ్మిది రోడ్ల నిర్మాణం మాత్రమే పూర్తి

 2021 వరకు గడువు పెంచిన ప్రభుత్వం

ఒంగోలు(జడ్పీ), జనవరి 8: మారుమూల ఉండే గ్రామాలను సైతం జిల్లాలోని ప్రధాన రహదారులకు అనుసంధానం చేసి ఆయా గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో 203 పనులను ఎంపిక చేశారు. ఈ పనులకు రూ.263.56 కోట్ల నిధులను గత ప్రభుత్వం కేటాయించింది. శివారు గ్రామాల ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలని జిల్లా వ్యాప్తంగా 203 పనులకు పంచాయతీరాజ్‌శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ పనులు మొత్తాన్ని నాలుగా విభాగాలుగా వర్గీకరించి నిధులను కేటాయించారు. మొదటి విభాగంలో 82 కిలోమీటర్ల పొడవు రోడ్డును 49కోట్ల వ్యయంతో, రెండవ విభాగం కింద 99 కిలోమీటర్ల పొడవుగల రహదారిని 52 కోట్లతో నిర్మించతలపెట్టారు. అదే విధంగా మూడో ప్యాకేజీ కింద 107 కిలోమీటర్ల రోడ్డును 72 కోట్ల వ్యయంతోను, నాల్గవ ప్యాకేజీ  పనులలో భాగంగా 115 కిలోమీటర్ల పోడవుగల మార్గాన్ని 89 కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టే విధంగా ప్రణాళికలు రచించారు. పనుల జాప్యానికి యంత్రాంగం అలసత్వానికి కరోనా కూడా తోడవడంతో  దాదాపు తొమ్మిది నెలల కాలం నుంచి నిర్మాణాలలో  ఎటువంటి పురోగతి లేదు. ఇటీవలే మళ్లీ పనులు ఊపందుకున్నాయని 2021 వరకు గడువు ఉందని , వివిధ దశల్లో ఉన్న పనులన్నింటిని శరవేగంగా పూర్తి చేస్తామని జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ చెబుతోంది

తొమ్మిది రోడ్ల నిర్మాణం పూర్తి

మొత్తం 203 పనుల్లో ఇప్పటి వరకు తొమ్మిది రోడ్లు మాత్రమే పూర్తయ్యాయి. 180 రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 14 పనులను ఇంతవరకు ప్రారంభించలేదు. తొలుత ఈ రహదారుల నిర్మాణానికి గడువును 2020 గానే నిర్ణయించారు. తరువాత గడువును 2021 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ పనులను త్వరితగతిన నిర్మిస్తే ఆయా గ్రామాల ప్రజల రహదారి వెతలు తీరతాయి.

 విభాగాల వారీగా కేటాయించిన పనులు

తొలి ప్యాకేజీలో కందుకూరు, కొండపి నియోజకవర్గాలలోని గ్రామాలు ఉండగా, రెండో విభాగంలో పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి, దర్శి నియోజకవర్గాలలోని గ్రామాలను చేర్చారు. మూడో దాని కింద గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, నాలుగో ప్యాకేజీలో కనిగిరిలోని గ్రామాలు ఉన్నాయి. 

Updated Date - 2021-01-09T05:00:36+05:30 IST