కరోనా ఎట్ 202 కేసులు
ABN , First Publish Date - 2020-07-09T09:31:37+05:30 IST
జిల్లాలో బుధవారం 202 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఆంధ్రజ్యోతి - న్యూస్నెట్వర్క్, జూలై 8: జిల్లాలో బుధవారం 202 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో గుంటూరులో 87 కేసులు ఉన్నాయి. గుంటూరులో ప్రకటించిన కేసుల్లో ఒకటి ఢిల్లీ నుంచి, ముగ్గురు తెలంగాణ నుంచి వచ్చిన వారు కాగా, 16 మంది క్వారంటైన్లో ఉన్న వారు. మిగిలిన వారంతా నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు.
ఈ ప్రకారం.. అరండల్పేట, సుద్దపల్లిడొంక, మిర్చియార్డు, ఆదిత్వనగర్, కొత్తపేట, రాజీవ్గాంధీనగర్, గాంధీనగర్, గుజ్జనగుండ్ల, రైలుపేట, శివనాగరాజురాలనీ, డీఎస్నగర్, ఎల్బీనగర్, తాజ్ రెసిడెన్సీ, గార్డెన్స్, విజయపురికాలనీ, భవానీపురం, నాయుడుపేట, గోరంట్ల, నగరాలు, ఐపీడీకాలనీ, ఆనందపేట, వేణుగోపాలనగర్, స్తంభాలగరువు, పొత్తూరివారితోట, జోసఫ్నగర్, సంపత్నగర్, వికలాంగులకాలనీ, సుబ్బారెడ్డినగర్, విద్యానగర్ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి, వర్కర్స్కాలనీ, శ్రీనివాసరావుతోట, గుంటూరివారితోట, కేవీపీకాలనీ, శాంతినగర్, చౌత్రా ప్రాంతాల్లో ఇద్దరు చొప్పున పాజిటివ్ వచ్చింది. సీతానగర్, యతిరాజులనగర్లో నాలుగేసి కేసులు రాగా సంగడిగుంటలో పది మందికి, నల్లచెరువులో 11 మందికి, శ్రీనగర్లో ముగ్గురికి, ఏటీఅగ్రహారంలో 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
అమరావతి, చెరుకుపల్లి, దాచేపల్లి, దుగ్గిరాల, గుంటూరు రూరల్, కారంపూడి, మేడికొండూరు, నాదెండ్ల, పిడుగురాళ్ల, రేపల్లె, శావల్యాపురం, తాడికొండ, చుండూరు గ్రామాల్లో ఒక్కొక్కరికి కరోనా వచ్చింది. మాచర్ల, మంగళగిరిలో ఐదుగురు చొప్పున, నరసరావుపేటలో 23, సత్తెనపల్లిలో 4, తాడేపల్లిలో 31, తెనాలిలో 15, చిలకలూరిపేటలో 3 కేసులు వచ్చాయి. పెదకాకాని, చేబ్రోలు, వినుకొండలో రెండేసి కేసులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
సత్తెనపల్లిలో రెండు కేసులు నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. 18వ వార్డు బొడ్రాయి సెంటర్, పదోవార్డులో రంగా బొమ్మవద్ద ఒక్కొక్క మహిళకు పాజిటివ్గా నిర్ధారించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళలో ఇటీవల విజయవాడ నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఫణిదం వైద్యాధికారి శేషుయాదవ్ తెలిపారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఓ మహిళ వితంతు పెన్షన్ కోసం గత నెల 29న రెంటపాళ్ళకు వచ్చి వెళ్లింది. ఆమె అప్పట్లో పరీక్షలు చేయించుకోగా ప్రస్తుతం వచ్చిన రిపోర్టులో పాజిటివ్గా వచ్చిందన్నారు.
కారంపూడిలోని ఆర్యవైశ్య వీధిలో బెంగళూరు నుంచి వచ్చిన ఓ యువకుడికి పాజిటివ్ వచ్చింది. శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తికి కూడా పాజిటివ్గా నిర్ధారించారు.
దాచేపల్లి మండలంలో మూడు కేసులు నమోదయ్యాయి. మాదినపాడు, దాచేపల్లి గ్రామాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్గా గుర్తించారు. నడికుడి రైల్వేస్టేషన్లో పని చేసే ఓ పోలీసు అధికారికి పాజిటివ్ వచ్చిందని, ఆయన గుంటూరులో నివాసం ఉంటారని అధికారులు తెలిపారు.
వినుకొండ పట్టణంలో మూడు కేసులు నమోదయ్యాయి. శావల్యాపురం మండలంలోని వేల్పూరులో తొలి కరోనా కేసు నమోదైనట్లు తహసీల్దార్ సుజాత తెలిపారు. పాజిటివ్ వచ్చిన వృద్ధురాలిని చిలకలూరిపేటలోని ఐసోలేషన్కు తరలించి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు.
బాపట్ల 34వవార్డులో ఓ వృద్ధురాలికి, మండలంలోని స్టూవర్టుపురంలో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చింది. నట్లు వైద్యాధికారులు తవివరించారు. ఈ నెల 3న హైదరాబాద్ నుంచి వచ్చిన వృద్ధురాలు గుంటూరులో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలినట్లు వైద్యాధికారి భాస్కరరావు తెలిపారు. చీరాల ఐఎల్టీడీ కంపెనీలో ఇద్దరికి పాజిటివ్ రావడంతో స్టూవర్టుపురానికి చెందిన యువకుడు ఆందోళనలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి జ్వరం రావటంతో ఈ నెల 5న చీరాల ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ మానస ప్రియదర్శిని తెలిపారు.
మంగళగిరిలో నాలుగు కేసులు నమోదైనట్లు కొవిడ్-19 వైద్యులు అంబటి వెంకటరావు తెలిపారు. వీరిలో ఒకరు మంగళగిరి పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగి కావడంతో కార్యాలయంలోని ఇతర అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. పలువురు సిబ్బంది బుధవారం విధులకు హాజరయ్యేందుకు సైతం వెనుకడుగు వేశారు. రాజీవ్ గృహకల్ప, ఇస్లాంపేట, కుప్పురావుకాలనీ ప్రాంతాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలిపారు.
మాచర్ల మండల పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. మాచర్ల పట్టణంలోని ఐదు, ఏడు వార్డుల్లో ఒక్కొక్కరికి, మండలంలోని కంభంపాడులో ఆర్ఎంపీతోపాటు, డిగ్రీ విద్యార్థికి కరోనా వచ్చింది.
గుండెనొప్పితో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరి ఈ నెల 6న మృతి చెందిన అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారించినట్లు వైద్యాధికారి శ్రీజ్యోతి తెలిపారు. మంగళవారం అతడి అంత్యక్రియలు నిర్వహించారని, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని సుభానీనగర్, వెంగళరెడ్డినగర్, నాదెండ్ల మండలం సాతులూరులో ఒక్కొక్కరికి పాజిటివ్గా నిర్ధారించినట్లు నోడల్ వైద్యాధికారి గోపీనాయక్ తెలిపారు.
రేపల్లెలో తొలి కరోనా కేసు నిర్ధారణ అయినట్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి తెలిపారు. పట్టణంలోని ఏబీఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో చిల్లర దుకాణం నిర్వహించే మహిళ అనారోగ్యంతో గుంటూరులో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలిందన్నారు. ఆమె ఇటీవల పొన్నూరు వెళ్ళివచ్చిందన్నారు.
పిడుగురాళ్ల మండలం పొందుగుల చెక్పోస్టులో కొవిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఎన్ఎంకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆమె నివాసం ఉంటున్న పిడుగురాళ్ల కుమ్మరిపాలెంలో అధికారులు పారిశుధ్యపనులు చేపట్టారు.
కలెక్టరేట్లో కరోనా కలకలం
కరోనా వైరస్ కలెక్టరేట్ని తాకింది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్ ప్రాంగణంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సీ-సెక్షన్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ సెక్షన్ని మూసేసి క్రిమిసంహారకం చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే కలెక్టరేట్లో 50 శాతం మంది ఉద్యోగులనే అనుమతిస్తున్నారు. అయినా కరోనా కేసులు రావడంతో లాక్డౌన్లో వలే 30 శాతం మంది సిబ్బందితోనే సెక్షన్లను నడపాల్సిన పరిస్థితి తలెత్తింది.