బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు
ABN , First Publish Date - 2021-04-16T16:32:52+05:30 IST
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి నాంపల్లి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్/మంగళ్హాట్ : బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి నాంపల్లి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యు. సుక్రత్సింగ్ అలియాస్ బిర్జు అలియాస్ సనం(39) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చాడు. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షిబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ట్రాన్స్పోర్ట్ లారీల వద్ద లోడింగ్, అన్లోడింగ్ పనులు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ సాయంత్రం ఐదేళ్ల బాలిక తన అన్నతో కలిసి ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తానని ఇద్దరినీ తన గదికి పిలిచాడు. తన సెల్ఫోన్ను బాలిక సోదరుడికి ఇచ్చి వీడియోలు చూడమని చెప్పి బయటకు పంపించి బాలికపై అత్యాచారం చేశాడు. చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పింది.
బాధితురాలి తల్లి అదేరోజు మంగళ్హాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే నెల 9వ తేదీన నిందితుడు సుక్రత్సింగ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన నాంపల్లి అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి సునీత కుంచాల నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఇన్స్పెక్టర్ తెలిపారు. సుక్రత్సింగ్ను చంచల్గూడ జైలుకు తరలించారు.