Big Ticket Abu Dhabi: రూ.30కోట్లు గెలిచిన భారతీయుడు.. 19 మంది స్నేహితులకూ పంచిచ్చాడు!

ABN , First Publish Date - 2021-08-05T16:21:30+05:30 IST

ఖతార్‌లో ఉండే భారత వ్యక్తికి అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసిందే. మంగళవారం తీసిన రాఫెల్ డ్రాలో సనూప్ సునీల్(32) అనే భారతీయుడు ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్(రూ.30.31కోట్లు) గెలచుకున్నాడు. జూలై 13న సునీల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం.183947కు..

Big Ticket Abu Dhabi: రూ.30కోట్లు గెలిచిన భారతీయుడు.. 19 మంది స్నేహితులకూ పంచిచ్చాడు!

అబుధాబి: ఖతార్‌లో ఉండే భారత వ్యక్తికి అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసిందే. మంగళవారం తీసిన రాఫెల్ డ్రాలో సనూప్ సునీల్(32) అనే భారతీయుడు ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్(రూ.30.31కోట్లు) గెలచుకున్నాడు. జూలై 13న సునీల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం.183947కు ఈ జాక్‌పాట్ తగిలింది. ఈ మొత్తాన్ని సునీల్ తన 19 మంది స్నేహితులతో పంచుకోనున్నాడు. 20 మంది మిత్రులు చెరో కొంత పొగుచేసి ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేయడంతో వారికి కూడా గెలిచిన ప్రైజ్‌మనీలో వాటా ఇవ్వనున్నాడు. సునీల్ మొదటిసారి కొన్న లాటరీ టికెట్‌కే ఈ జాక్‌పాట్ తగలడం మరో విశేషం. ఇక మంగళవారం లాటరీ డ్రా తీసిన సమయంలో సునీల్ మొదట ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్షంగా చూశాడు. తొలుత రెండో బహుమతి 1 మిలియన్ దిర్హమ్స్ విజేతను ప్రకటించారు నిర్వాహకులు. 


దాంతో తాను గెలవలేకపోయానని నిరాశతో లైవ్ చూడడం ఆపేశాడు. ఈ లాటరీలో మొదటి బహుమతి 15 మిలియన్ దిర్హమ్స్ తాను గెలవడం అసాధ్యం అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఆ తర్వాత ఈ మొదటి బహుమతి విజేతగా సునీల్ నిలిచాడు. ఈ విషయం అతనికి తెలియదు. ఈ క్రమంలో భారీ మొత్తం గెలుచుకున్న సునీల్‌కు లాటరీ నిర్వాహకులు ఫోన్ చేయగా ఆ నెంబర్ పనిచేయలేదు. ఎందుకంటే సునీల్ అందులో ఇచ్చిన మొబైల్ నెంబర్ స్వదేశంలో ఉన్న తన భార్యది. దాంతో నిర్వాహకులు ఆ నెంబర్‌కు కాంటాక్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి స్నేహితుల నుంచి సునీల్‌కు వరుసగా ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. బిగ్‌టికెట్ రాఫెల్‌లో రూ.30కోట్లు గెలుచుకున్నట్లు వారు చెప్పారు. 


కానీ, సునీల్ వారు చెప్పింది మొదట నమ్మలేదు. దాంతో నిర్వాహకులకు ఫోన్ చేసి నిర్ధారించుకున్న తర్వాత అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను కొన్న మొదటి లాటరీ టికెట్‌కే ఇంత భారీ మొత్తం తగలడంతో సునీల్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. చాలా రోజులుగా తన స్నేహితులు ఓ గ్రూపుగా ఏర్పడి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నారని, దాంతో తాను తొలిసారి వారితో కలిసి టికెట్ కొన్నట్లు చెప్పాడు. అదే తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోయాడు. గ్రూపులోని 20 మంది కూడా కేరళ వాసులే. సునీల్ గత 7 ఏళ్లుగా లులు గ్రూపులో పని చేస్తున్నాడు. లులు గ్రూపులో పని చేయడం కూడా ఒకవిధంగా తాను ఈ భారీ మొత్తం గెలవడానికి కారణమైందని, తమపై బాస్ యూసఫ్ అలీ ఆశీర్వచనాలు కచ్చితంగా ఉంటాయని సునీల్ తెలిపాడు.   

Updated Date - 2021-08-05T16:21:30+05:30 IST