ఒడిలో చిన్నారి మృతదేహం.. లేమ్మా నాపై కోపమా.. అంటూ గుండెలవిసేలా రోదించిన తల్లి! హృదయాన్ని పిండేసే ఘటన ఇది!

ABN , First Publish Date - 2021-10-18T02:25:04+05:30 IST

గుండెలు పిండేసే ఘటన.. తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచిన పసిపాప..

ఒడిలో చిన్నారి మృతదేహం.. లేమ్మా నాపై కోపమా.. అంటూ గుండెలవిసేలా రోదించిన తల్లి! హృదయాన్ని పిండేసే ఘటన ఇది!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటివరకూ ఆ పాపాయి తల్లి ముందే ఆడుకుంది. ముద్దుముద్దు మాటలతో ఆమెను మురిపించింది. ఇంతలో.. చెత్త తీసుకెళ్లే వాహనం ఇంటి ముందుకు వస్తే తల్లి చెత్త పారేసేందుకు బయటకు వెళ్లింది. ఆమె వెనకే ఆ చిన్నారి కూడా వెళ్లింది. కానీ..ఈ విషయాన్ని తల్లి గమనించలేదు. వాహనంలో కూర్చున్న డ్రైవర్‌ దృష్టి కూడా పాపపై పడలేదు. చెత్తను బండిలో వేసాక ఆమె వెనుదిరిగింది. డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతే.. ఒక్కసారిగా పాప పెద్ద కేక పెట్టింది.


పెను ప్రమాదం జరిగిందని గుర్తించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. కానీ.. అప్పటికే జరగవలిసిన అనర్థం జరిగిపోయింది. చక్రాల కింద నలిగిపోయి... నొప్పి భరించలేక పాప గిలగిలా కొట్టుకుంటోంది. డ్రైవర్ ఆమెను తల్లి ఒడిలో పడుకోపెట్టాడు. ఆ మరుక్షణమే ఆమె మృతి చెందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌ నగరంలో శనివారం ఉదయం ఈ దారుణం జరిగింది. 


చిన్నారి కాయు అగర్వాల్ మృతదేహాన్ని చూస్తూ ఆమె తల్లి ఆషూ అగర్వాల్ గుండెలవిసేలా రోదించింది. నాపై కోపమొచ్చిందా తల్లీ.. లేమ్మా..ఒక్కసారి చూడమ్మా అంటూ ఆమె రోదిస్తుంటే చూసిన చుట్టుపక్కల వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆషూ అగర్వాల్‌కు ఇద్దరు అమ్మాయిలు.. పెదమ్మాయి పేరు అభవ్యా(5), రెండో అమ్మాయి పేరు కాయు(2). ఇంత చిన్న వయసులోనే కాయును కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకానికి అంతేలేకుండా పోయింది.  

Updated Date - 2021-10-18T02:25:04+05:30 IST