టెన్త్ పరీక్షల్లో ఒకే రోజు 2 పేపర్లు! 6 పేపర్లకు కుదింపుతో మారిన విధానం
ABN , First Publish Date - 2022-05-13T16:44:07+05:30 IST
మారిన పరీక్ష విధానంలో భాగంగా... పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఒకే రోజు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్లో మొదటి గంటన్నర సమయంలో ఫిజికల్ సైన్స్ పేపర్, తర్వాత గంటన్నరలో బయోలాజికల్ సైన్స్ పేపర్ పరీక్షలు..
మొదట ఫిజికల్ సైన్స్... తర్వాత బయోలాజికల్ సైన్స్
6 పేపర్లకు కుదింపుతో మారిన విధానం
5 నిమిషాల వరకు లేట్ అయినా అనుమతి
2,861 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు
టెన్త్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): మారిన పరీక్ష విధానంలో భాగంగా... పదో తరగతి విద్యార్థులు(Tenth grade students) వార్షిక పరీక్షల్లో ఒకే రోజు రెండు పేపర్ల( Two papers in one day)ను రాయాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్లో మొదటి గంటన్నర సమయంలో ఫిజికల్ సైన్స్ పేపర్, తర్వాత గంటన్నరలో బయోలాజికల్ సైన్స్ పేపర్ పరీక్షలు రాయాలి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ రెండు పేపర్లను ఒకే పరీక్షగా పరిగణిస్తారు. అయితే మూల్యాంకనం వేర్వేరుగా చేస్తారు. మార్కులను మాత్రం రెంటికీ కలిపే ఇస్తారు. రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉత్తీర్ణతను నిర్ణయిస్తారు. ఈ నెల 27వ తేదీన జనరల్సైన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు. మొదటి 1.35 గంటల వ్యవధిలో ఫిజికల్ సైన్స్ పేపర్ పరీక్ష ఉంటుంది.
విద్యార్థులు రాసిన పేపర్లను తిరిగి తీసుకోవడానికి 5 నిమిషాలు కేటాయిస్తారు. అనంతరం బయోలాజికల్ సైన్స్ పేపర్ను విద్యార్థులకు అందిస్తారు. ఈ పేపర్ను 1.35 గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. కరోనా కారణంగా టెన్త్ పరీక్ష విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో టెన్త్లో 11 పేపర్లు ఉండేవి. వాటిని ప్రస్తుతం 6 పేపర్లకు కుదించారు. అంటే... ఒకేషనల్తో సంబంధం లేకుండా రెగ్యులర్ టెన్త్లో 6 పేపర్లకే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గతేడాది పరీక్షలు రద్దయ్యాయి. దీంతో ఈ ఏడాది తొలిసారిగా మారిన పద్ధతిలో పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జూన్ 1 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో టెన్త్ పరీక్షల కోసం 2.30 గంటల సమయం ఇచ్చేవారు. ఈ ఏడాది మరో 15 నిమిషాల సమయాన్ని పేపర్ చదువుకోవడానికి, మరో 30 నిమిషాలను పరీక్ష రాయడానికి అదనంగా ఇచ్చారు. ఇలా మొత్తం పరీక్షకు 3.15 గంటల సమయం ఉంటుంది. అలాగే... ఈసారి ప్రశ్నపత్రాల్లో కూడా మార్పులుచేశారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు మినహా అన్ని రకాల ప్రశ్నల్లో చాయి్సను పెంచారు. కాగా.... రాష్ట్రంలో సుమారు 5,09,275 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాలను ఏర్పాటుచేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. కెమెరాలో రికార్డు అయ్యే ప్రాంతంలోనే ప్రశ్నపత్రాలను కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఆన్లైన్లో కూడా హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే... ఇంటర్నల్ మార్కుల జాబితాలు కూడా ఇప్పటికే తయారయ్యాయి.