పెళ్లయిన రెండు రోజులకే.. వధువుకు కరోనా

ABN , First Publish Date - 2020-05-22T19:17:13+05:30 IST

పెళ్లైన రెండు రోజులకే ఓ నవవధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో కొత్త పెళ్లి జంటకు ఓ వింత చిక్కు వచ్చిపడింది.. కొత్త జీవితాన్ని

పెళ్లయిన రెండు రోజులకే.. వధువుకు కరోనా

మధ్యప్రదేశ్: పెళ్లైన రెండు రోజులకే ఓ నవవధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో కొత్త పెళ్లి జంటకు ఓ వింత చిక్కు వచ్చిపడింది.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వధూవరులిద్దరూ ఆశిస్తే.. అది కాస్తా బెడిసికొట్టినట్టయింది. వారి పెళ్లికి వెళ్లిన 30 మంది కుటుంబాల్లో కలవరం మొదలైంది.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా సత్లాపూర్ గ్రామంలో జరిగింది.. వివరాల్లోకి వెళ్తే.. 


సుదీర్ఘ లాక్‌డౌన్ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులతో పెళ్లి చేసుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి యాభై మంది, చావుకయితే ఇరవై మందినే అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా సత్లాపుర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో భోపాల్‌లోని జట్ కేడికి చెందిన యువతితో పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. సోమవారం 30 మందితో కలిసి వారి పెళ్లి నిరాడంబరంగా జరిపించారు. పెళ్లయిన రెండో రోజే వధువులో కాస్త అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నవవధువుకు కరోనా పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. దీంతో అటు వరుడు, ఇటు వధువు కుటుంబాల్లోనే కాకుండా పెళ్లికి వెళ్లిన ముఫ్పై కుటుంబాల్లో కూడా ఆందోళన మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్యశాఖ సిబ్బంది పెళ్లికొడుకుతో సహా పెళ్లికి హాజరైన వారందరినీ గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. అంతేకాకుండా ఆ ముఫ్పై మందితో కాంటాక్టులో ఉన్న వారిని కూడా ట్రేస్ చేసే పనిలో సిబ్బంది ఉన్నారు.


పెళ్లికి వారం ముందే జ్వరంతో బాధపడిన ఆ యువతి మాత్రలు వేసుకోవటంతో కాస్త తగ్గింది. అయినప్పటికీ శనివారం ఆమెకు తల్లిదండ్రులు కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత సోమవారం కొద్ది మంది సమక్షంలో యువతికి పెళ్లి జరింపించారు. కానీ పెళ్లైన రెండు రోజులకే బుధవారం నాటికి యువతికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 5981 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, అందులో దాదాపు 64 కేసులు ఉజ్జాయిన్ జిల్లా నుంచే ఉన్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాగా రాష్ట్రంలో 2483 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. మొత్తం 270 మంది వైరస్ బారినపడి మరణించారు.


Updated Date - 2020-05-22T19:17:13+05:30 IST