కర్ణాటకలో కరోనా మరణాల కలవరం.. గత 24 గంటల్లో..
ABN , First Publish Date - 2020-07-06T01:47:31+05:30 IST
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కర్ణాటకలో...
బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కర్ణాటకలో నమోదైన కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 37 మంది కరోనా వల్ల మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో.. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య 372కి చేరింది. తమిళనాడు తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలోనే కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా కర్ణాటకలో అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో కర్ణాటకలో 1925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,474కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 13251. వీరిలో 243 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా కొంత ఆశాజనకంగానే ఉంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 603 మంది డిశ్చార్జ్ అయినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలో ఇప్పటివరకూ 9847 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.