1,879 జాతీయ రహదారుల ఫైళ్లు పెండింగ్ : కలెక్టర్
ABN , First Publish Date - 2022-07-06T07:13:12+05:30 IST
జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల పనులకు సంబంధించి 1,879 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 5: జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల పనులకు సంబంధించి 1,879 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసి వెంకటేశ్వర్, డీఆర్వో రాజశేఖర్, సర్వే, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తచ్చూరు రహదారికి సంబంధించి 912, చెన్నై రహదారికి సంబంధించి 967 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. మండలాల వారీగా జేసీ వాటిని పరిశీలించాలని సూచించారు. భూరీసర్వేకు సంబంధించి 41 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, 49 గ్రామాల్లో ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. రీసర్వే సమయంలో భూ సరిహద్దు తగాదాలపై అందే అప్పీళ్లను ఎక్కడికక్కడ పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. విస్తీర్ణంలో తేడా ఉంటే రైతులతో చర్చించి, పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో సర్వే శాఖ ఏడీ గిరిధర్ రెడ్డి, సర్వే ఇన్స్పెక్టర్ లత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్వీన్, తహసీల్దార్లు అమరేంద్ర, సుశీల పాల్గొన్నారు.