ఏడాదిలో 182 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం: జమ్మూకశ్మీర్ డీజీపీ

ABN , First Publish Date - 2021-12-31T23:55:05+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోఈ ఏడాది (2021) 100కు పైగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు విజయవంతంగా..

ఏడాదిలో 182 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం: జమ్మూకశ్మీర్ డీజీపీ

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోఈ ఏడాది (2021) 100కు పైగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని, 44 మంది కరడుగట్టిన ఉగ్రవాదులతో సహా 182 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఉగ్రవాదుల చొరబాట్లను బాగా తగ్గించామని, కేవలం 34 మంది ఉగ్రవాదులే  సరిహద్దులను దాటగలిగారని చెప్పారు.


హైదర్‌పోర ఘటనపై దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ, ఇది నిష్టాక్షికంగా జరిపిన ఆపరేషన్ అని చెప్పారు. నవంబర్ 15న జరిపిన ఆపరేషన్‌లో ఒక పాకిస్థాన్ ఉగ్రవాది, మరో ముగ్గురు హతమయ్యారని, వీరందరికీ ఉగ్రవాద సంబంధాలున్నాయని చెప్పారు. జరగరాదని జరిగిందని, వారంతా అమాయకులను వారి కుటుంబ సభ్యులు చెబుతుండటం సరికాదని అన్నారు. రాజకీయ పార్టీలు సైతం కశ్మీర్ పోలీసులను తప్పుపడుతుండటంపై ప్రశ్నించగా, ఇలాంటి ఎత్తుగడలు మంచివి కావని, వారి వద్ద ఎలాంటి సాక్ష్యాలున్నా దర్యాప్తు ప్యానల్స్‌కు అందజేయాలని, అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం చట్టవ్యతిరేకమని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని దిల్‌బాగ్ సింగ్ చెప్పారు


జమ్మూకశ్మీర్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద 497 మందిని అరెస్టు చేసినట్టు దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. గత 24 గంటల్లో 9 మంది జేఈఎం టెర్రరిస్టులను మట్టుబెట్టామని చెప్పారు. పఠాన్‌కోట్ చౌక్‌ వద్ద పోలీసు బస్సుపై దాడి జరిపిన కేసులో వీరికి ప్రమేయం ఉందన్నారు. ఈ ఏడాది 134 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో  చేరారని, వీరిలో 76 మందిని మట్టుబెట్టగా, 22 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

Updated Date - 2021-12-31T23:55:05+05:30 IST