యూఏఈ నుంచి చండీగఢ్ చేరిన 179 మంది భారత ప్రవాసులు
ABN , First Publish Date - 2020-08-07T18:41:53+05:30 IST
కరోనా లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను 'వందే భారత్ మిషన్' ద్వారా కేంద్రం స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే.
చండీగఢ్: కరోనా లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను 'వందే భారత్ మిషన్' ద్వారా కేంద్రం స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా యూఏఈ నుంచి 179 మంది భారతీయులు చండీగఢ్ చేరుకున్నారు. గురువారం స్పైస్ జెట్ విమానం ఎస్జీ-9302 యూఏఈ నుంచి వీరిని మధ్యాహ్నం 2.31 గంటలకు చండీగఢ్ అంతర్జాతీయ విమానశ్రయానికి తీసుకొచ్చింది. ఈ 179 మంది ప్రయాణికుల్లో ఎక్కువగా పంజాబ్తో పాటు దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఇక మే 6న ప్రారంభమైన 'వందే భారత్ మిషన్' ద్వారా ఇప్పటివరకు 10 లక్షల 59వేల మంది భారత ప్రవాసులు లబ్ధి పొందారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో 9 లక్షల 39వేల మందిని వివిధ దేశాల నుంచి స్వదేశానికి తరలిస్తే... లక్ష 20 వేల మంది భారత్ నుంచి విదేశాలకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 'వందే భారత్ మిషన్' ఐదో దశ కొనసాగుతోంది.