రోజుకు రూ.1,612 కోట్లు

ABN , First Publish Date - 2022-09-22T06:27:45+05:30 IST

ఈ ఏడాదికి విడుదల చేసిన ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ లో 1,103 మందికి చోటు దక్కింది.

రోజుకు రూ.1,612 కోట్లు

గత ఏడాదికాలంలో అదానీ సంపాదన ఇది.. 


రూ.10.94 లక్షల కోట్లు దాటిన ఆయన ఆస్తి

కుబేరుల లిస్ట్‌లో అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి.. 

ఈ ఏడాది 1,100 దాటిన భారత శ్రీమంతుల జాబితా 

వారి మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లకు చేరిక 

ఏడాదికి విడుదల చేసిన ఐఐఎ్‌ఫఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ లో 1,103 మందికి చోటు దక్కింది. గత ఏడాదితో పోలిస్తే కుబేరుల సంఖ్య 96 పెరిగిందని, గడిచిన ఐదేళ్లలో 62 శాతం వృద్ధి నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి కనీ సం రూ.1,000 కోట్లు, అంతకుపైగా ఆస్తి కలిగిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించింది. ఈసారి లిస్ట్‌లోని సంపన్నుల మొత్తం ఆస్తి విలువ తొలిసారిగా రూ.100 లక్షల కోట్లకు చేరుకుందని ఐఐఎ్‌ఫఎల్‌, హురున్‌ వెల్లడించాయి. సింగపూర్‌, యూఏఈ, సౌదీ అరేబియాల మొత్తం జీడీపీ కంటే కూడా ఇది అధికమని తెలిపింది. మరిన్ని విషయాలు.. 


అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ రూ.10,94,400 కోట్ల సంపదతో 2022 వార్షిక జాబితాలో తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద రోజుకు సరాసరిగా రూ.1,612 కోట్ల చొప్పున ఎగబాకి రెట్టింపునకు పైగా పెరిగిందని, ఏడాదికాలంలో 116 శాతం (రూ.5,88,500 కోట్లు) వృద్ధి చెందిందని వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో ఆయన సంపద 1,440 శాతం పుంజుకుంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ రూ.7,94,700 కోట్ల ఆస్తితో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. గత ఏడాది ఆయన ఆస్తి 11 శాతం పెరిగినప్పటికీ, పదేళ్లలో తొలిసారిగా అగ్రస్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గత ఏడాది వార్షిక నివేదిక ప్రకారం.. అదానీ కంటే అంబానీ రూ.2 లక్షల కోట్ల అధిక ఆస్తి కలిగి ఉండగా.. ఈ సారి లిస్ట్‌ ప్రకారం, అంబానీ కంటే అదానీ రూ.3 లక్షల కోట్ల అధిక సంపద కలిగి ఉన్నారు. 

క్విక్‌ కామర్స్‌ స్టార్టప్‌ జెప్టో సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా (19 ఏళ్లు) ఈసారి రిచ్‌ లిస్ట్‌లోని అత్యంత పిన్న వయస్కురాలు. అంతేకాదు, ఆమెకు తొలిసారిగా ఈ జాబితాలో చోటు లభించింది. 

ఈ జాబితాలో 100 మంది స్టార్టప్‌ వ్యవస్థాపకులకు స్థానం దక్కింది. వారి మొత్తం ఆస్తి రూ.5.06 లక్షల కోట్లు కాగా, వారి సగటు వయసు 40 ఏళ్లు. 

లిస్ట్‌లో 12 మంది రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తి కలిగి ఉన్నారు. గత ఏడాది 13 మంది ఈ విభాగంలో నిలిచారు. 

కనీసం బిలియన్‌ డాలర్ల (100 కోట్ల డాలర్లు=రూ.8,000 కోట్లు) సంపద కలిగినవారు 221 మంది ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 16 మేర తగ్గినప్పటికీ, గడిచిన పదేళ్లలో మాత్రం 4 రెట్లు పెరిగింది. 

లిస్ట్‌లోని 67 శాతం (735) మంది స్వయంశక్తితో ఎదిగిన వారే. గత ఏడాది వీరి సంఖ్య 659గా నమోదైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే వీరి సంఖ్య 54 శాతం పెరిగింది. అంతేకాదు, ఈ ఏడాది జాబితాలో చోటు సంపాదించిన వారిలో 79 శాతం మంది స్వయంశక్తితో సంపన్నులైన వారే. 

అత్యధికంగా ఫార్మా రంగం నుంచి 126 మందికి జాబితాలో స్థానం లభించగా.. కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ రంగం నుంచి 102 మంది, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ నుంచి 84 మంది ఈ లిస్ట్‌లో ఉన్నారు. 

గత ఏడాదితో పోలిస్తే ఈసారి 602 మంది సంపద వృద్ధి చెందగా.. అందులో 149 మంది కొత్తవారే. 415 మంది ఆస్తి తరిగిపోగా.. 50 మంది స్థానం కోల్పోయారు. నలుగురు మరణించారు. 

అత్యధికంగా ముంబై నుంచి 283 మందికి చోటు దక్కగా.. ఢిల్లీ నుంచి 185, బెంగళూరు నుంచి 89, హైదరాబాద్‌ నుంచి 64, చెన్నై నుంచి 51 మంది ఈ లిస్ట్‌లో ఉన్నారు.

Updated Date - 2022-09-22T06:27:45+05:30 IST