ఫోన్ మాట్లాడొద్దని కుమార్తెను తల్లి మందలించడంతో...!
ABN , First Publish Date - 2021-06-20T17:53:27+05:30 IST
ఫోన్ మాట్లాడొద్దని తల్లి మందలించడంతో ఓ బాలిక
హైదరాబాద్ సిటీ/ఘట్కేసర్ రూరల్ : ఫోన్ మాట్లాడొద్దని తల్లి మందలించడంతో ఓ బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా, ఒంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతులు కూతురు, కొడుకుతో కలిసి గత కొంతకాలంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మునిసిపాలిటీ, అన్నోజిగూడ, రాజీవ్గృహకల్పలో నివాసం ఉంటున్నారు. కూతురు(16) తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు గమనించిన తల్లిదండ్రులు.. అతిగా ఫోన్లో మాట్లాడొద్దని మందలించారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బాలిక ఫోన్లో మాట్లాడుతుండగా గమనించిన తల్లి ఫోన్ మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోవా? అంటూ కూతురిని హెచ్చరించింది. దీంతో బాలిక శుక్రవారం అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా మెలకువతో ఉంది. ఇది గమనించిన తల్లి కూడా అర్ధరాత్రి వరకు మెలుకువగా ఉండి, తర్వాత నిద్రకు ఉపక్రమించింది. కాగా బాలిక శుక్రవారం రాత్రి 11:56 నిమిషాలకు ఇంట్లో ఉన్న కిరోసిన్బాటిల్ తీసుకొని మొయిన్డోర్కు బయట నుంచి గడియపెట్టి ఖాళీ స్థలంలోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పుంటించుకుంది. దీంతో బాలిక అక్కడిక్కడే మృతిచెందింది. తెల్లవారుజామున వాకింగ్కు వచ్చిన స్థానికులు బాలిక మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో సీఐ చంద్రబాబు, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మల్కాజ్గిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు, మల్కాజ్గిరి షీ టీం డీసీపీ సలీమా ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.