అమెరికాలో మరో 16 మంది ఎన్నారైలకు 'కరోనా'
ABN , First Publish Date - 2020-04-10T17:04:25+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికా ఇప్పుడు ఈ సూక్ష్మజీవి కారణంగా గజగజ వణికిపోతుంది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ పెద్దన్నగా పేరొందిన అమెరికా ఇప్పుడు ఈ సూక్ష్మజీవి కారణంగా గజగజ వణికిపోతుంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4.65 లక్షలకు పైగా కరోనా బాధితులు ఉండగా, 16,697 మంది మృత్యువాత పడ్డారు. ఇక న్యూయార్క్ నగరమైతే శవాల దిబ్బగా మారిపోయింది. ఒక్క ఈ నగరంలోనే 1,61,504 మంది కొవిడ్-19 బారిన పడగా, 7,067 మంది మరణించారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అగ్రరాజ్యం ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరు.
ఇదిలాఉంటే యూఎస్లో ఈ మహమ్మారి కారణంగా చనిపోతున్న భారతీయుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. రెండు రోజుల కింద ఐదుగురు ఎన్నారైలు మృతి చెందగా, గురువారం నాటికి ఈ సంఖ్య 11కి చేరింది. మరో 16 మంది భారతీయులకు కరోనా సోకింది. వైద్య పరీక్షల అనంతరం ఈ 16 మంది ఎన్నారైలను అధికారులు క్వారంటైన్కు తరలించినట్టు సమాచారం. ఇక తాజాగా పాజిటివ్గా నిర్ధారణ అయిన 16 కేసులలో సుమారు 10 మంది న్యూయార్క్కు చెందిన వారేనని అధికారులు తెలియజేశారు.