హిమాచల్లో ఘోర అగ్నిప్రమాదం.. 16 ఇళ్లు ఆహుతి
ABN , First Publish Date - 2021-10-28T01:21:19+05:30 IST
హిమాచల్ప్రదేశ్లోని కుల్లు జిల్లా మలానా గ్రామంలో బుధవారంనాడు ఘోర అగ్నిప్రమాదం..
కుల్లు: హిమాచల్ప్రదేశ్లోని కుల్లు జిల్లా మలానా గ్రామంలో బుధవారంనాడు ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉవ్వెత్తున అగ్నికీలకు ఎగసిపడి వాయివేగంతో విస్తరించడంతో 16 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 150 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఐటీబీపీ సిబ్బంది వెంటనే రంగంలోకి సహాయక కార్యక్రమాలు చేపట్టింది. మంటలు అదుపులోకి వచ్చినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ డైరెక్టర్ సుదేశ్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఎవరూ మృతిచెందినట్టు సమాచారం లేదు.
ప్రధాని, హోం మంత్రి దిగ్భ్రాంతి..
కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. చారిత్రక మలానా గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన విచారకరమని, బాధిత కుటంబాలకు తన సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రధాని ఓ ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అవసరమైన అన్ని సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడతాయని పేర్కొన్నారు.