తండ్రిని గొడ్డలితో నరికి చంపి తన వేళ్లు కాల్చుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. ఆ హత్యకు కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-04-06T17:58:15+05:30 IST

ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు.. సరిగ్గా చదవకపోవడంతో తండ్రి ప్రతిరోజూ ఆ కుర్రాడిని తిట్టేవాడు..

తండ్రిని గొడ్డలితో నరికి చంపి తన వేళ్లు కాల్చుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. ఆ హత్యకు కారణమేంటో తెలిస్తే షాక్!

ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు.. సరిగ్గా చదవకపోవడంతో తండ్రి ప్రతిరోజూ ఆ కుర్రాడిని తిట్టేవాడు.. కొద్ది రోజుల్లో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో పాస్ కాకపోతే ఇంటి నుంచి బయటకు గెంటేస్తానని హెచ్చరించాడు.. దీంతో ఆ కుర్రాడిలో దిగులు ప్రారంభమైంది.. తను పదో తరగతి పాస్ కావడం కష్టమని భావించాడు.. తండ్రిని చంపేస్తే తనకేం ప్రమాదం ఉండదని ప్లాన్ చేశాడు.. గత ఆదివారం తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు.. పోలీసులను చాలా కన్ఫ్యూజ్ చేసి చివరకు దొరికిపోయాడు. 


మధ్యప్రదేశ్‌లోని గునకు చెందిన దులిచంద్ర అహిర్వార్ (46) గత ఆదివారం మధ్యాహ్నం హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రపోతున్న తన తండ్రిని ఎవరో గొడ్డలితో నరికేశారని, పట్టుకుందామని ప్రయత్నిస్తే తనను తోసేసి పారిపోయాడని అహిర్వార్ 15 ఏళ్ల కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పక్కింటి వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ పక్కింటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అతను హత్య చేయలేదని తేలడంతో మరోసారి విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు చేసిన 15 ఏళ్ల బాలుడి చేతి వేళ్ల ముందు భాగాలు కాలిపోయి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఆ కుర్రాడి మీద అనుమానం పెరిగింది. 


ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో ఆ కుర్రాడు పోలీసులకు నిజం చెప్పేశాడు. పదో తరగతి పాస్ కాకపోతే తనను ఇంట్లో నుంచి గెంటేస్తానని తండ్రి హెచ్చరించాడని, అందుకే అతడిని గొడ్డలితో నరికి చంపేశానని తెలిపాడు. ఆ కుర్రాడిని అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-04-06T17:58:15+05:30 IST