బడికి దూరంగా 157 మంది పిల్లలు

ABN , First Publish Date - 2022-01-29T04:28:34+05:30 IST

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బడికి దూరంగా 157 మంది పిల్లలున్నట్లు విద్యాశాఖ గుర్తించింది.

బడికి దూరంగా 157 మంది పిల్లలు

 సంగారెడ్డి జిల్లాలో ముగిసిన బడిబయటి పిల్లల సర్వే


సంగారెడ్డి అర్బన్‌, జనవరి 28: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బడికి దూరంగా 157 మంది పిల్లలున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈనెల 11న ప్రారంభమైన బడిబయటి పిల్లల సర్వే 25న ముగిసింది. జిల్లావ్యాప్తంగా సీఆర్పీ, ఐఈఆర్పీలు, ఎంఈవోలు సర్వేలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలబాలికల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ చాలా మంది బడికి దూరంగానే ఉంటున్నారు. ఎన్ని సర్వేలు చేసినా.. పిల్లలు చదువుకోవాలని అధికారులు పదేపదే చెబుతున్నా, బాల్యం మాత్రం బడిబయటే మగ్గుతున్నది. దీంతో బడి బయటి పిల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే(ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌-ఓఎస్‌సీ)ను అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా 6-14 ఏళ్లలోపు, 15-19 ఏళ్ల లోపు ఉన్న బడీడు పిల్లల వివరాలు సేకరించింది. అయితే 6-14 ఏళ్ల లోపు పిల్లలు-75 మంది, 15-19 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారు 50 మంది, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు 32 మంది ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 157 మంది బడికి దూరంగా ఉంటున్నట్లు విద్యా శాఖ చేపట్టిన సర్వే ద్వారా తేల్చారు. విద్యార్థి సామర్థ్యం, వయసు ప్రకారం వీరి అర్హత ఆసక్తిని బట్టి తగిన తరగతిలో చేర్పించటం, దూర విద్యలో ప్రవేశాలు కల్పించేలా కృషి చేయనున్నామని డీఈవో నాంపల్లి రాజేశ్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-29T04:28:34+05:30 IST