Be Careful : Hyderabad లో కొత్తగా 155 సిగ్నళ్లు..
ABN , First Publish Date - 2021-12-02T16:06:33+05:30 IST
Hyderabad లో కొత్తగా 155 సిగ్నళ్లు..
హైదరాబాద్ సిటీ : వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న గ్రేటర్లోని 155 జంక్షన్లలో కొత్తగా సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఉన్న 221 చౌరస్తాలతోపాటు, కొత్త జంక్షన్లలో సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించారు. 98 చోట్ల పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అడాప్టెడ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్(ఏటీఎస్సీ) వినియోగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 చోట్ల ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు.
పోలీస్ అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా కొత్త ఏరియాల్లో సిగ్నళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని సిగ్నళ్లనూ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించి వాహనాల రాకపోకలను పర్యవేక్షించడంతోపాటు వివరాలు రికార్డు చేస్తారు. పలు ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టు ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. ఇప్పటికే పలు కారిడార్లలో మార్కింగ్, ఆస్తుల సేకరణ మొదలైందని, దశల వారీగా ఇతర ప్రాంతాల్లోనూ పనులు చేస్తామంటున్నారు.