భారత్, పాక్ సరిహద్దుల్లో 150 మీటర్ల సొరంగం
ABN , First Publish Date - 2021-01-14T07:00:03+05:30 IST
జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద 150మీటర్ల పొడవైన సొరంగాన్ని సరిహద్దు భద్రత బలగాలు(బీఎ్సఎఫ్) గుర్తించాయి.
కథువా జిల్లాలో గుర్తించిన బీఎస్ఎఫ్
జమ్ము, జనవరి 13: జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద 150మీటర్ల పొడవైన సొరంగాన్ని సరిహద్దు భద్రత బలగాలు(బీఎ్సఎఫ్) గుర్తించాయి. జమ్ము ప్రాంతంలోని సాంబ, కథువా జంట జిల్లాల్లో గడచిన ఆరు నెలల్లో బీఎ్సఫ్ ఇప్పటికే రెండింటిని గుర్తించగా, తాజా సొరంగం మూడవది. ‘‘దాదాపు 150మీటర్ల పొడవైన సొరంగాన్ని బీఎ్సఎఫ్ గస్తీ బృందం కథువా జిల్లా హీరానగర్ సెక్టార్లోని బాబియాన్ గ్రామంలో గుర్తించింది. పాకిస్థాన్లో ఉగ్ర శిబిరాలకు నెలవైన షకీర్గఢ్ నుంచి దీన్ని తవ్వారు. పాకిస్థాన్కు చెందిన గుర్తులతో ఉన్న ఇసుక సంచులను గుర్తించాం. ఈ సొరంగాన్ని గుర్తించేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాం. దీని ద్వారా భారత్లోకి చొరబాట్లు జరిగాయా లేదా అన్న విషయం దర్యాప్తు అనంతరం తెలుస్తుంది’’ అని అధికారులు స్పష్టం చేశారు. సాంబ జిల్లాలో గత ఏడాది ఆగస్టు 28, నవంబరు 22 తేదీల్లో రెండు సొరంగాలను బీఎ్సఎఫ్ గుర్తించిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా దేశంలోకి చొరబడిన ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్లో బలగాలు అంతమొందించాయి.