ఫేస్బుక్ ఫ్రెండ్ను కలిసేందుకు రాష్ట్రం దాటి వెళ్లిపోయిన 15 ఏళ్ల బాలిక.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-04-15T18:44:16+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా మంది జీవితాలను ఆక్రమించింది. ముఖ్యంగా యువత ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతోనే
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా మంది జీవితాలను ఆక్రమించింది. ముఖ్యంగా యువత ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు పెంచుకుంటున్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడి కోసం రాజస్థాన్కు చెందిన ఓ బాలిక ఇంట్లో చెప్పకుండా ఏకంగా మధ్యప్రదేశ్ వెళ్లిపోయింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంతో అన్వేషించి పోలీసుల సహాయంతో ఆ బాలికను పట్టుకున్నారు.
రాజస్థాన్లోని కోటాకు చెందిన పదిహేనేళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఫేస్బుక్లో ఎక్కువ సమయం గడిపే ఆమెకు మధ్యప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడితో ఆ బాలిక గంటలు కొద్దీ మాట్లాడేది. అతడిని కలిసేందుకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఏకంగా రాష్ట్రం దాటిగ్వాలియర్కు వెళ్లిపోయింది. ఆ బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
ఆ బాలిక గురించి పూర్తి సమాచారం తీసుకుని పోలీసులు ఆమె గురించి అన్వేషణ ప్రారంభించారు. ఆ బాలిక స్కూల్లో విచారించారు. ఆ బాలిక ఆన్లైన్ ద్వారా గ్వాలియర్కు బస్ టికెట్ కొన్న విషయం తెలుసుకున్నారు. ఆమె గ్వాలియర్ రైల్వే కాలనీలో బస్ దిగినట్టు తెలుసుకుని అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. వారి సహకారంతో ఎట్టకేలకు బాలిక ఆచూకీ కనుగొన్నారు. ఆ బాలిక ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుని ఆమెను పట్టుకున్నారు. తిరిగి కోటా తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.