కల్లు తాగి 15 మందికి అస్వస్థత
ABN , First Publish Date - 2021-12-09T04:53:00+05:30 IST
కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురైన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో బుధవారం చోటు చేసుకున్నది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో ఘటన
నర్సాపూర్, డిసెంబరు8: కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురైన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో బుధవారం చోటు చేసుకున్నది. ప్రస్తుతం బాధితులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గూడెంగడ్డలో ఉన్న ఓ కల్లు దుకాణంలో గ్రామానికి చెందిన పోచయ్య, సహదేవ్, రాజు, నర్సింహులు, అంజయ్య, చంద్రయ్యతో పాటు మొత్తం 15 మంది వరకు కల్లుతాగి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రిలో ఐదుగురు, ప్రైవేట్ ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతుండగా, ముగ్గురు సంగారెడ్డి ఆస్పత్రికి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. మిగతా ముగ్గురు చికిత్స పొంది ఇంటికి వెళ్లినట్లు వివరించారు. ఈ మధ్యకాలంలో నర్సాపూర్ మండలంలో కల్లు తాగి అస్వస్థతకు గురవ్వడం ఇది రెండోది కావడం గమనార్హం. పదిరోజుల క్రితం రెడ్డిపల్లిలో పదిమంది కల్లు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా గ్రామాల్లో కొందరు కల్లు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరమైన సీహెచ్, డైజోఫాంను మత్తుకోసం కలపడం వల్లనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీహెచ్, డైజోఫాంను నియంత్రించడానికి ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, కల్లు వ్యాపారులు మా త్రం దొంగచాటుగా తెప్పించుకుంటూ ప్రజల ఆరోగ్యం తో చెలగాటాలాడుతున్నారనే పలువురు మండిపడుతున్నారు.