ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆగస్టు నెలలో ఆహార భద్రత కార్డులు కలిగిన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్-19 సంక్షోభం ఏర్పడినప్పటినుంచి ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ కింద కేంద్రం పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న విషయం విదితమే! 2022 జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఈ పంపిణీ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా అప్పుడప్పుడూ కోటాకు కోత పెడుతూ వస్తోంది. గత మే నెలలో మొత్తానికే ఉచిత బియ్యం పంపిణీని ఎత్తివేసింది.
కేంద్ర ప్రభుత్వ కోటా కింద 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గోదాముల నుంచి లిఫ్ట్ చేసి.. పేదలకు పంపిణీ చేయలేదు. జూన్లో కిలోకు రూపాయి చొప్పున ఒక్కొక్కరికి 6 కిలోలు పంపిణీ చేసింది. కేంద్రం పంపిన 5 కిలోల ఉచిత బియ్యం ఇవ్వలేదు. దీంతో తెలంగాణ నుంచి సేకరించే కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను కేంద్రం నిలిపివేసింది. ఈ క్రమంలో జూన్ నెల చివరివారంలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేసింది. జూలై నెలలో 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. మే నెల కోటాను వచ్చే అక్టోబరులో పంపిణీ చేస్తామని కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేకపోవటంతో.. ఆ కోటాను ఆగస్టులో ఇస్తామని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలోనే ఆగస్టులో ఒక్కొక్కరికి 15 కిలోలు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది.