ఎంజీఎంకు 15 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-16T09:46:42+05:30 IST
వరంగల్ ఎంజీఎంలో బుధవారం 15మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
వైద్యుడు, నర్సుతో పాటు 13 మందికి కొవిడ్-19
హన్మకొండ అర్బన్, జూలై 15: వరంగల్ ఎంజీఎంలో బుధవారం 15మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వైరాలజీ ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా గుర్తించిన 15మందిని కొవిడ్-19 విభాగం ఐసోలేషన్ వార్డులో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. హన్మకొండ ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడితో పాటు ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న ఒక నర్సు, శుంభునిపేటకు చెందిన ముగ్గురు, కరీమాబాద్కు చెందిన ఇద్దరు, గిర్మాజిపేట, పాపయ్యపేట చమన్, రంగశాయిపేట, విద్యానగర్ కాలనీకి చెందిన వారిని పాజిటివ్గా గుర్తించినట్లు తెలిపారు.
ఈ రోజు 29మంది కొవిడ్-19 విభాగంలో అడ్మిట్ అయ్యారన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కనిపించని 11మందికి కౌన్సిలింగ్ నిర్వహించి హోం క్వారంటైన్కు తరలించినట్లు చెప్పారు. కొవిడ్-19 విభాగంలో మొత్తం 94మంది వైద్యసేవలు పొందుతున్నట్లు ఆయన వివరించారు.