14 మంది హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
ABN , First Publish Date - 2021-12-07T06:12:52+05:30 IST
14 మంది హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 6 : పరిసరాల పరిశుభ్రత లోపించడం, హాస్టల్ గదులకు దోమతెరలు లేకపోవడంతో సోమవారం మచిలీపట్నం మైనారిటీ గురుకుల విద్యాలయం హాస్టల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు వైరల్ ఫీవర్గా నిర్ధారించారు. హాస్టల్లో 92 మంది విద్యార్థులుండగా, 14 మందికి ఫీవర్ సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చిలకలపూడిలోని వరలక్ష్మి పాలిటెక్నిక్ అద్దె భవనంలో గురుకుల విద్యాలయం, హాస్టల్ భవనాలు ఉన్నాయని, గురుకుల విద్యాలయం చుట్టూ నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద ఎక్కువైందని, దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. విద్యార్థులను మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్ పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.జయకుమార్, ఆర్ఎంవో మల్లికార్జునరావు, డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, డాక్టర్ జగదీష్తో మాట్లాడారు. విద్యార్థులకు వైరల్ ఫీవర్ సోకినట్లు డీఎంహెచ్వో సుహాసిని కలెక్టర్కు తెలిపారు. అనంతరం కలెక్టర్ హాస్టల్ను సందర్శించి, విధి నిర్వహణలో అలసత్వం చూపుతున్న తెలుగు, బయోలాజికల్ సైన్సెస్ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. హాస్టల్ను పర్యవేక్షించాలని ముడా వీసీ శివనాగరెడ్డికి సూచించారు. ముడా చైర్మన్ బొర్రా భవానీ, మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా, ఆర్డీవో ఖాజావలి పాల్గొన్నారు. గురుకుల విద్యాలయాల డైరెక్టర్ రాములు కూడా హాస్టల్ను సందర్శించారు.
భవనాలు పూర్తిచేయకపోవడం వల్లే : మాజీమంత్రి కొల్లు రవీంద్ర
టీడీపీ హయాంలో గురుకుల పాఠశాల హాస్టల్కు రుద్రవరంలో భూములు, నిధులు కేటాయించామని, భవనాలు పూర్తి కాకపోవడం వల్లే మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు అద్దె భవనంలో ఉండాల్సి వస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ పరామర్శించారు.