జోన్-5లో 134 మంది
ABN , First Publish Date - 2021-03-05T06:12:57+05:30 IST
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 98 వార్డులకు కలిపి 566 మంది (వార్డుకు సగటున ఆరుగురు) పోటీ చేస్తున్నారు.
అత్యల్పంగా జోన్-1లోని నాలుగు వార్డులకు 17 మంది పోటీ
గ్రేటర్ బరిలో ఉన్న అభ్యర్థులపై పూర్తి స్పష్టత
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 98 వార్డులకు కలిపి 566 మంది (వార్డుకు సగటున ఆరుగురు) పోటీ చేస్తున్నారు. అత్యధికంగా జోన్-5 పరిధిలోని 24 వార్డులకు 134 మంది పోటీ చేస్తుండగా, అత్యల్పంగా జోన్-1 పరిధిలోని నాలుగు వార్డులకు కలిపి 17 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక జోన్-2 పరిధిలో తొమ్మిది వార్డులు (5 నుంచి 13 వార్డులు) వుండగా 54 మంది, జోన్-3 పరిధిలో 14 (14-27) వార్డులు వుండగా 72 మంది, జోన్-4 పరిధిలో 12 (28-39) వార్డులు వుండగా 82 మంది, జోన్-5 పరిధిలో 24 (40-63) వార్డులు వుండగా 134 మంది, జోన్-6 పరిధిలో 20 (64-79, 85-88) వార్డులు వుండగా 129 మంది పోటీలో ఉన్నారు. ఇక జోన్-7 పరిధిలో ఐదు (80-84) వార్డులు వుండగా 24 మంది పోటీలో ఉన్నారు. జోన్-8 పరిధిలో పది (89-98) వార్డులు వుండగా 55 మంది పోటీలో ఉన్నారు. ఇక పార్టీల వారీగా పోటీలో వున్నవారి వివరాలను పరిశీలిస్తే వైసీపీ నుంచి వార్డుకు ఒకరు చొప్పున 98 మంది, టీడీపీ నుంచి 94 మంది పోటీలో ఉన్నారు. రెండుచోట్ల వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోవడం, మరో రెండుచోట్ల అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరించుకోవడంతో స్వతంత్రులుగా పోటీలో వున్న వారికి పార్టీ బీఫారాలు అందజేయడంతో నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు అధికారికంగా లేనట్టు అధికారులు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 67 మంది, జనసేన నుంచి 51 మంది, బీజేపీ నుంచి 44 మంది, సీపీఎం నుంచి 19 మంది, సీపీఐ నుంచి ఆరుగురు, బీఎస్పీ నుంచి తొమ్మిది మంది, గుర్తింపు పొందిన ఇతర పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లుగా 178 మంది పోటీలో ఉన్నారు.