కరోనా రూల్స్: పాటిస్తే రూ.47 వేల సాయం, లేకపోతే 9.5 లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2020-09-20T20:10:28+05:30 IST

కరోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రభుత్వం కఠిన నిబంధనలకు తెరలేపింది

కరోనా రూల్స్: పాటిస్తే రూ.47 వేల సాయం, లేకపోతే 9.5 లక్షల జరిమానా!

లండన్: కరోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రభుత్వం కఠిన నిబంధనలకు తెరలేపింది. ముఖ్యంగా.. కరోనా సోకిందని తెలిసీ ఐసోలేషన్‌లో ఉండని వారిపై దాదాపు తొమ్మిదిన్నర లక్షల రూపాయల జరిమానా(13 వేల డాలర్లు) విధించేందుకు సిద్ధమైంది. బ్రిటన్‌పై కరోనా రెండో దాడి ప్రారంభమైందని ఇటీవలే ప్రకటించిన ప్రధాని బోరిస్ జాన్సన్.. బ్రిటన్ వాసులపై కఠిన ఆంక్షలకు తెరలేపారు. ఇందులో భాగంగా.. శనివారం మరిన్ని నిబంధనలు ప్రకటించారు. 


కరోనా సోకిందని తెలిసిన అనంతరం.. లేదా.. ప్రభుత్వం ద్వారా సమాచారం అందిన తరువాత బాధితులు కచ్చితంగా ఐసోలేషన్ విధించుకోవాలని సూచించారు. ఇది చట్టపరంగా వారిపై ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు. ‘అందరూ నిబంధనలు పాటించడమే కరోనాతో పోరాడేందుకు ఉత్తమమైన మార్గం. కరోనా బారినపడిన వారు కచ్చితంగా సెల్ఫె ఐసోలేట్ చేసుకోవాలి. ఈ నిబంధన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉండేందుకే కఠినమైన నిబంధనలు రూపొందించాం’ అని ఆయన చెప్పారు. 


తాజా నిబంధనల ప్రకారం.. కరోనా నియమాలు ఉల్లంఘించిన వారిపై వెయ్యి నుంచి పది వేల పౌండ్ల వరకూ వివిధ రకాల జరిమానాలు విధిస్తారు. అంతర్జాతీయ ప్రయాణాల అనంతరం క్వారంటైన్‌కు పరిమితం కానీ వారిపై వెయ్యి పౌండ్ల ఫైన్ విధిస్తే.. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొన్ని సందర్భాల్లో ఏకంగా పది వేల పౌండ్ల జరిమానా పడుతుంది. అదే సమయంలో.. నిబంధనలు పాటించే ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నజరానాలు కూడా ప్రకటించింది. 


కరోనా కారణంగా పనికి వెళ్లలేక, ఇంట్లోంచి వర్క్ ఫ్రం హోం చేయలేకపోతున్న అల్పాదాయ వర్గాలకు 500 పౌండ్ల ధనసహాయం కూడా చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ‘కరోనా కట్టడి కోసం అనేక మంది నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అయితే ఆర్థిక పరమైన కారణాల రీత్యా ఇంటికి పరిమితం కాలేని వారి కోసం ఈ సహాయం చేస్తున్నాం’ అని బోరిస్ జాన్సన్ తెలిపారు.  

Updated Date - 2020-09-20T20:10:28+05:30 IST