బీజేపీ నుంచి ఎస్పీలోకి 13 మంది ఎమ్మెల్యేలు: బాంబు పేల్చిన శరద్ పవార్

ABN , First Publish Date - 2022-01-12T02:37:32+05:30 IST

ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. యూపీ కార్మికశాఖ మంత్రి స్వామి

బీజేపీ నుంచి ఎస్పీలోకి 13 మంది ఎమ్మెల్యేలు: బాంబు పేల్చిన శరద్ పవార్

న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. యూపీ  కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి, బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరి షాకిస్తే, ఆ తర్వాత మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.


ఈ వరుస షాకుల నుంచి బీజేపీ కోలుకోకముందే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ, ఇతర చిన్నపార్టీలతో కలిసి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు చెప్పిన శరద్ పవార్.. ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పకుండా మనం యూపీలో మార్పును చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.


అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యూపీలో మతపరంగా ప్రజలను ఏకీకృతం చేసే పనులు ప్రారంభమయ్యాయని, యూపీ దీనికి గట్టిగా బదులిస్తుందని అన్నారు. కాగా, అంతకుముందు ముంబైలో శరద్ పవార్ మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీఎంసీలతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు.


కార్మికశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్‌పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దళితులు, రైతులు, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలను, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం మానేసిందని అన్నారు. తన రాజీనామాకు అదే కారణమని అన్నారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఏడు విడతలుగా జరగనున్నాయి. ఫిబ్రవరి 7న తొలి విడత జరగనుంది. మార్చి 10న ఓట్లు లెక్కిస్తారు. 

Updated Date - 2022-01-12T02:37:32+05:30 IST