విలయతాండవం
ABN , First Publish Date - 2020-07-16T12:11:35+05:30 IST
జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎవరిలో కరోనా ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.
120 పాజిటివ్ కేసులు నమోదు
కడపలో 63
మొత్తం బాధితులు 2248 మంది
కడప నగరంలో 644 కేసులు
బ్యాంకు సిబ్బందినీ వదలని కరోనా
కడప, జూలై 15: జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎవరిలో కరోనా ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం మరో 120 కేసులు నమోదయ్యాయి. దీంతో బాఽధితుల సంఖ్య మొత్తం 2248కి చేరుకుంది. ఇక కరోనా మహమ్మారి కడప నగరాన్ని కమ్ముకుంది. జిల్లా కేంద్రం కావడం, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకోవడంతో వివిధ పనుల నిమిత్తం రాకపోకలు పెరిగాయి. అదే స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది. కొందరు పోలీసులు ఇప్పటికే మహమ్మారి బారిన పడగా ఇప్పుడు కొందరు ఉపాధ్యాయులు, బ్యాంకు సిబ్బంది, మరికొందరు ఉద్యోగులకు కరోనా సోకింది. కడపలోని ఓ ప్రధాన బ్యాంకుల్లోని ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. కొంతమంది వైద్యుల్లో కూడా పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది.
బుధవారం కడప కార్పొరేషన్లో ప్రకాశ్నగర్, ఎర్రముక్కపల్లె, మరియాపురం, నకాష్, బెల్లంమండీవీధి ఎస్ఎఫ్ స్ర్టీట్, ఆర్కేనగర్, ట్రంకు రోడ్డు, ఆర్వీనగర్, దేవునికడప, విజయదుర్గాకాలనీ, పాతకడప, ఎన్జీవో కాలనీల్లో 63 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క కడపలోనే 644 మంది కరోనా బారిన పడ్డారు. ఖాజీపేట 9, ప్రొద్దుటూరు 8, బద్వేలు, సీకేదిన్నెలో ఐదైదు చొప్పున, రైల్వేకోడూరు 4, వేంపల్లె, అట్లూరులో మూడేసి చొప్పున, ఎర్రగుంట్ల, రాజంపేట, చిట్వేలి, దువ్వూరు, పెండ్లిమర్రిలో రెండేసి చొప్పున, సిద్దవటం, మైదుకూరు, సింహాద్రిపురం, రామాపురం, తొండూరు, రాయచోటి, సంబేపల్లె, వల్లూరు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదు కాగా విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒక కేసు నమోదైంది.
67 మంది డిశ్చార్జి
కరోనా వైరస్ నుంచి సంపూర్ణంగా కోలుకున్న 67 మందిని జిల్లా కోవిడ్ ఆసుపత్రి ఫాతిమా మరియు కోవిడ్ సెంటరు నుంచి బుఽధవారం డిశ్చార్జి చేసినట్లు కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 1233 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు.
కోవిడ్-19 సమాచారం
మొత్తం శాంపిల్స్ - 94814
రిజల్ట్ వచ్చినవి - 88939
నెగటివ్ - 86691
పాజిటివ్ - 2248
డిశ్చార్జ్ అయినవారు - 1233
రిజల్ట్ రావాల్సినవి - 5875
15వ తేదీ తీసిన శాంపిల్స్ - 1610