రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్

ABN , First Publish Date - 2021-11-29T22:25:39+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం

రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరు సభలో గందరగోళం సృష్టించినందుకు శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరిని సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. 


ప్రియాంక చతుర్వేది (శివసేన), డోలా సేన్ (టీఎంసీ), ఎలమారం కరీం (సీపీఎం), కాంగ్రెస్ ఎంపీలు ఫులో దేవి నేతం, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సీపీఐకి చెందిన బినయ్ విశ్వం, టీఎంసీ ఎంపీ శాంత ఛేత్రి, శివసేన ఎంపీ అనిల్ దేశాయ్‌ రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. 


వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరంతా తీవ్రంగా ప్రవర్తించారని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. సీపీఎం ఎంపీ ఎలమారం కరీం ఓ పురుష మార్షల్‌పై దాడి చేశారని, ఛాయా వర్మ, ఫులో దేవి ఓ మహిళా మార్షల్‌పై దాడి చేశారని తెలిపింది. ఈ నివేదికను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుకు సమర్పించింది. 


వీరికి జారీ చేసిన సస్పెన్షనల్ నోటీసులో వీరు 2021 ఆగస్టు 11న  సభ చైర్మన్ అధికారం పట్ల పూర్తిగా అగౌరవాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. పంతంపట్టి సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-29T22:25:39+05:30 IST