రాష్ట్రంలో 1,178 కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-07-08T08:16:50+05:30 IST
రాష్ట్రం లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 1,178 కొత్త కేసులు వెలుగు చూశాయి. వరుసగా రెండోరోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
- 21,197కు చేరిన పాజిటివ్లు
- గుంటూరులో అత్యధికంగా
- 236 మందికి వైరస్ నిర్ధారణ
- తూర్పున మహిళా ఖైదీకి కొవిడ్
- 3 పోలీసుస్టేషన్లలో వణుకు
- ఆరు జిల్లాల్లో 13 మంది మృతి
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 1,178 కొత్త కేసులు వెలుగు చూశాయి. వరుసగా రెండోరోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 1,155 మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ ల సంఖ్య 21,197కు చేరింది. తాజాగా 762 మంది కోలుకున్నారు. 11,200 మంది ఆస్పత్రు ల్లో చికిత్స పొందుతుండగా, 9,745 మంది డిశ్చార్జి అయ్యారు. మంగళవారం కర్నూలులో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూ రు, విశాఖల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13మంది మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 252కు పెరిగింది.
గుంటూరుపై పంజా
గుంటూరులో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరు నగర పరిధిలో 139మంది వైరస్ బారిన పడ్డారు. సత్తెనపల్లిలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి పాజిటివ్గా తేలిన 24 గంటల్లోనే మృతి చెందడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాం బర్లోని ఓ ఉద్యోగికి కొవిడ్ నిర్ధారణ అయింది. విద్యుత్ కార్యాలయంలో పలువురు ఉద్యోగుల కు లక్షణాలు ఉండటంతో పాటు ఓ జూనియర్ ఇంజనీర్కు వైరస్ సోకడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. తాడేపల్లిలో 24, తెనాలిలో 21 చొప్పున కొత్త కేసులు గుర్తించారు.
తూర్పున కల్లోలం
తూర్పు గోదావరి జిల్లాలో మరో 146 మందికి వైరస్ నిర్ధారణ అయింది. అత్యధికంగా కాకినాడలో 65 మందికి పాజిటివ్గా తేలింది. రాజమహేంద్రవరం మహిళా జైలులో ఓ ఖైదీకి పాజిటివ్ వచ్చింది. గతనెల 29న అరెస్ట్ చేసిన ఈమెను విచారణ నిమిత్తం పలు స్టేషన్లకు తిప్పారు. ఇప్పుడు ఆమెకు వైరస్ నిర్ధారణ కావడంతో మూడు స్టేషన్ల సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. రాజోలు మండలంలో ఇటీవల తీవ్ర జ్వరంతో మృతిచెందిన వ్యక్తి ద్వారా ఆయ న కుటుంబంలో అయిదుగురికి కొవిడ్ సోకిం ది. పెద్దాపురంలో పట్టణంలోని ఓ బ్యాంకులో క్రెడిట్ కార్డుల జారీ విభాగం ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తికి పాజిటివ్ రాగా, ఇప్పుడు ఆ యన బంధువులు 14మందికి వైరస్ సంక్రమించింది. గంగవరం మండలం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న పదిమంది ఉద్యోగులకు వ్యాధి నిర్ధారణ అయింది. మండపేట పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చింది. కాకినాడ జీజీహెచ్లో మృతిచెందిన ఇద్దరికి మరణానంతర పరీక్షల్లో కొవిడ్ సోకినట్లు తేలింది. కొవిడ్ బారినపడి తిరుపతికి చెందిన పండ్ల వ్యాపారి(50) మంగళవా రం మృతి చెందారు.
కర్నూలులో మరో 84 కేసులు వెలుగు చూశాయి. ఉయ్యాలవాడ మం డలంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా ఐదుగురికి వ్యాధి నిర్ధారణ అయింది. నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు వై ద్యులు, వారి కుటుంబ సభ్యులకు, అవుకులో తల్లి, కుమారుడికి సంక్రమించింది. విశాఖలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 128 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 186, అనంతపురంలో 153, చిత్తూరు జిల్లాలో 112, కృష్ణా, నెల్లూరుల్లో 100 చొప్పున కేసులు వెలుగు చూశాయి.