ఒకేరోజు 110 మందికి కరోనా పాజిటివ్.. భయం.. భయం!
ABN , First Publish Date - 2020-04-02T15:59:01+05:30 IST
నాలుగు రోజుల క్రితం వరకు తక్కువ సంఖ్యలోనే కొవిడ్-19 పాజిటివ్లు రావడంతో ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం..
- అందరూ ఢిల్లీ నుంచి వచ్చినవారే
- బాధితుల సంఖ్య 234
- క్వారంటైన్లో 77,330 మంది
చెన్నై : కరోనా వైరస్ తమిళ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు తక్కువ సంఖ్యలోనే కొవిడ్-19 పాజిటివ్లు రావడంతో ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎంతగా అంటే.. బుధవారం ఒక్కరోజే 110 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 234 చేరింది. అంతేకాదు, దేశంలో అధిక కరోనా బాధితులు కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానానికి చేరుకుంది. ఇలా ఒక్కసారిగా కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. బాధితుల్లో 190 మంది ఢిల్లీ నిజాముద్దీన్ మహానాడులో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చినవారేని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బీలా రాజేష్ బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా 110
మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని, దీంతో మొత్తం బాధితుల సంఖ్య 234కి చేరిందని చెప్పారు. వీరిలో రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన 190 మంది ఢిల్లీ మహానాడులో పాల్గొన్నవారేనని స్పష్టం చేశారు. ఢిల్లీ మహానాడులో పాల్గొన్నవారిలోని 1,103 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆసుపత్రులో చేరారని, వారిలో 658 మంది నమూనాలు పరిశోధనలకు పంపామని, మిగిలినవారి నమూనాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కరోనా బాధితుల గృహాలు, లక్షణాలున్న అనుమానితులు మొత్తం 77,330 మంది క్వారంటైన్లో ఉన్నారని, అలాగే 1,103 మంది నివసిస్తున్న ప్రాంతాల పరిసరాలను కూడా నిర్భంధించామని, ఆ ప్రాంతాల్లో నివసించే వారిని గృహనిర్భంధంలో ఉండాలని సూచించామని చెప్పారు. ముఖ్యంగా కరోనా బాధితులతో కాంటాక్ట్లో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. ఇక రాష్ట్రంలో ఒకరోజుకు 5వేల నమూనాలను పరీక్షించే సామర్ధ్యం ఉందని బీలా రాజేష్ తెలిపారు.