ఒకేరోజు 11 మంది.. మిస్సింగ్..!
ABN , First Publish Date - 2020-10-31T08:02:16+05:30 IST
అదృశ్యం కేసులు కలవరం కలిగిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు 11 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీ్సస్టేషన్ పరిధిలో నలుగురు, బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నలుగురు, హయత్నగర్
వారిలో అక్కాచెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు
ఆందోళనలో కుటుంబ సభ్యులు
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 30(ఆంధ్రజ్యోతి): అదృశ్యం కేసులు కలవరం కలిగిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు 11 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీ్సస్టేషన్ పరిధిలో నలుగురు, బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నలుగురు, హయత్నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఒకరు అదృశ్యమైనట్లు (వేర్వేరు సంఘటనలలో) కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు యువతులు, ఒక టీనేజ్ అమ్మాయి (వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు), మరో ఇద్దరు మైనర్లయిన అన్నాచెల్లెళ్లు. కొన్నిచోట్ల కుటుంబపరమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తుండగా.. మరికొన్ని మిస్టరీగా ఉన్నాయి. ఈ నెల 29న (గురువారం) మూడు కమిషనరేట్ల పరిధిలో 32 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వివిధ కారణాలతో ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న వారి కేసులు ఎక్కవవుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది మళ్లీ కుటుంబం చెంతకు చేరిన సంఘటనలూ ఎక్కువే. అయితే.. ఈ లోపల కుటుంబ సభ్యులకు వేదన, పోలీసులకు టెన్షన్ మిగులుతున్నాయి. అదేకాక.. నేరాలు పెరుగుతున్న ఈ రోజులలో.. ఇల్లు వదిలి వెళ్లిపోవడం, బయటివారిని నమ్మడం ప్రమాదకరమే అని పోలీస్ అధికారులు, సామాజిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.