HYD : గర్భిణికి బీపీ, ఫిట్స్‌.. మూడు ప్రాణాలను కాపాడిన ‘108’

ABN , First Publish Date - 2021-09-13T16:33:27+05:30 IST

108 ఆంబులెన్స్‌ సిబ్బంది సమయస్ఫూర్తితో గర్భిణి, కవల పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు....

HYD : గర్భిణికి బీపీ, ఫిట్స్‌.. మూడు ప్రాణాలను కాపాడిన ‘108’

  • గర్భిణికి బీపీ, ఫిట్స్‌ 
  • చికిత్స చేసిన అంబులెన్స్‌ సిబ్బంది
  • సురక్షితంగా కవలలకు జన్మనిచ్చిన మహిళ

హైదరాబాద్ సిటీ/కీసర రూరల్‌ : 108 ఆంబులెన్స్‌ సిబ్బంది సమయస్ఫూర్తితో గర్భిణి, కవల పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధి కుందన్‌పల్లి శ్రీ రామలింగేశ్వర కాలనీలో చోటుచేసుకుంది. 108 ఆంబులెన్స్‌లో ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న రవి తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధి కుందన్‌పల్లి శ్రీ రామలింగేశ్వర కాలనీకి చెందిన రాధిక(23) గర్భిణి. ఆదివారం అకస్మాత్తుగా బీపీ లెవల్స్‌ పెరిగాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.


పరిస్థితిని గమనించిన రాధిక కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది, ఆమెను అంబలెన్స్‌లోకి ఎక్కించారు. బీపీ పెరగడంతో పాటు ఫిట్స్‌ వస్తుండటాన్ని గమనించిన సిబ్బంది సంస్థ ఉన్నతాధికారి ఆలం సూచనలు పాటిస్తూ, ఇంజక్షన్లు ఇస్తూ, రాధికను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను కోటిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. పండంటి కవల(మగ) పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. దీంతో రాధిక కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ 108 సిబ్బందిని అభినందించారు.

Updated Date - 2021-09-13T16:33:27+05:30 IST