108 సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలి
ABN , First Publish Date - 2022-05-21T04:21:38+05:30 IST
ఎండనక వాననక కరోనాను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతున్న తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని 108 సిబ్బంది కోరారు.
కావలి, మే 20: ఎండనక వాననక కరోనాను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతున్న తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని 108 సిబ్బంది కోరారు. కావలి రైల్వేరోడ్డులోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న 108 సిబ్బంది కార్యాలయం వద్ద శుక్రవారం వారు నిరసన తెలిపారు. యూనియన్ నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమకు మూడు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు తక్షణం చెల్లించాలన్నారు. 108 సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఆరోగ్యశ్రీ నోడల్ అధికారికి గురువారం సమ్మె నోటీస్ ఇచ్చామని, 15 రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని చెప్పారు.
ఉదయగిరి రూరల్ : 108 వాహన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఉదయగిరి పట్టణంలో 108 సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఏఈఎంఎస్ సంస్థ మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి, దుత్తలూరు 108 సిబ్బంది పాల్గొన్నారు.