104 వాహనం కనుమరుగు!
ABN , First Publish Date - 2022-06-20T05:08:55+05:30 IST
104 వాహనం కనుమరుగు!
- నిలిచిపోనున్న సంచార వైద్యసేవలు
కొడంగల్ రూరల్, జూన్ 18 : గ్రామీణ ప్రాంతాల్లో ఆపదలో సంజీవనిలా వైద్యసేవలందించిన 104 వాహనం ఇకపై కనుమరుగు కానుంది.! రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించేందుకు 2009వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. కాగా, 2018వ సంవత్సరంలో అసంక్రమిత(ఇన్ఫెక్టెడ్) వ్యాధుల గుర్తింపు కార్యక్రమం అమల్లోకి వచ్చాక 104 వైద్యసేవల అవసరం తగ్గిపోయింది. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు గ్రామాల్లో ఇంటింటి సర్వేలో గుర్తించిన వ్యక్తులకు రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులు ఉంటే ఆన్లైన్లో నమోదుచేసి వారికి స్వయంగా ఇంటింటికీ వెళ్లి ప్రతీనెల ఉచితంగా కావాల్సిన మందులను అందిస్తున్నారు. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉప ఆరోగ్యకేంద్రాలను, పల్లె దవాఖానాలను అభివృద్ధి చేసి.. అందులోనూ ఎంబీబీఎస్ వైద్యులతో సేవలందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో 104 వాహనాల్లో సేవలందించిన వైద్య సిబ్బందిని ఇతర సేవలకు వినియోగించుకోవాలని ఆదేశించడంతో ఆ సిబ్బందిని ప్రభుత్వ ఆసుపత్రులకు సర్దుబాటు చేశారు. ఈమేరకు వికారాబాద్ జిల్లాలో 7 వాహనాల సేవలు కనుమరుగు కానున్నాయి.
- సంచార వైద్యసేవలను కొనసాగించాలి
104 వైద్యసేవలను కొనసాగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో 104 వాహనం వస్తే చాలు.. వయసు పైబడిన వారు వాహనం వద్దకు చేరుకొని బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేయించుకొని మందులను ఉచితంగా పొందేందుకు అవకాశం ఉండేది. 104 వాహనాల వైద్యసేవలను తొలగించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది.
కె.హన్మంతు, పెద్దనందిగామ