కరోనా 200..వణికిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2020-05-22T10:26:07+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను కలవర పెడుతున్నాయి.

కరోనా 200..వణికిస్తున్న వైరస్‌

12 రోజుల్లో 100 కేసులు

నెల్లూరుని దాటేసిన సూళ్లూరుపేట


నెల్లూరు(వైద్యం), మే 21 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను కలవర పెడుతున్నాయి. తగ్గుతోందనుకుంటున్న సమయంలో చెన్నై కోయంబేడు మార్కెట్‌ లింకుల ద్వారా వైరస్‌ విజృంభించింది. దీంతో కేసులు రెండొందలు దాటాయి. ఈ నెల 9వతేదీ నాటికి వంద కేసులు ఉండగా ఆ తర్వాత కేవలం 12 రోజుల్లో మరో వంద కేసులు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మార్చి 9వ తేదీన తొలి పాజిటివ్‌తో మొదలయిన కేసుల పరంపర ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఊపందుకుంది. ఆ నెలలో ఢిల్లీ మర్కజ్‌ లింకుల కారణంగా అనూహ్యంగా కేసులు పెరిగాయి. ప్రధానంగా నెల్లూరు నగరాన్ని వైరస్‌ చుట్టుముట్టింది.


నాయుడుపేట, వాకాడు మండలాల్లోనూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. బాధితులు కోలుకుంటున్నారు, కొత్త కేసులు తగ్గుతున్నాయి అనుకుంటున్న తరుణంలో కోయంబేడు దెబ్బకు జిల్లా ఉలిక్కిపడింది. ముఖ్యంగా సూళ్లూరుపేటను కేసులు కుదిపేశాయి. ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో 70 కేసులు నమోదుకాగా ఆ సంఖ్యను సూళ్లూరుపేట అతి స్వల్ప కాలంలోనే దాటేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 201 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వారిలో నలుగురు మృత్యువాతపడ్డారు, 109 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గతంలో ఐసోలేషన్‌కు వచ్చిన వారిని 14 రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తుండగా కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలతో ఇప్పడు 10 రోజులకే విడుదల చేస్తున్నారు. దీంతో డిశ్చార్జిల సంఖ్య కూడా పెరుగుతోంది.

Updated Date - 2020-05-22T10:26:07+05:30 IST