కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ చేయూత

ABN , First Publish Date - 2021-07-31T05:45:35+05:30 IST

కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని పొదుపులక్ష్మి ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు రూ.10 లక్షల విరాళం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ చేయూత
ఎమ్మెల్యే కాటసాని చేతుల మీదుగా చెక్కును అందజేస్తున్న ముప్పా రాజశేఖర్‌

  1. ఓర్వకల్లు బాలభారతి పాఠశాలకు రూ.10 లక్షల విరాళం


కర్నూలు (కల్చరల్‌), జూలై 30: కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని పొదుపులక్ష్మి ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు రూ.10 లక్షల విరాళం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. వరుసగా రెండో సంవత్సరం అందిస్తున్న రూ.10 లక్షల విరాళాన్ని పాఠశాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మికి అందించారు. అనాథ విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్య అందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రవి పొట్లూరి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిషత్తులో కూడా తమవంతు సహకారం అందిస్తామని, పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రవాసుల సేవానిరతి అభినందనీయమని అన్నారు. కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ సంస్థ స్ఫూర్తితో జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఓర్వకల్లు పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్న బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ అందిస్తున్న సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి అన్నారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణ శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ ముప్పా రాజశేఖర్‌ మాట్లాడుతూ జిల్లాకు చెందిన కళాకారులు, మేధావులు, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. ఓర్వకల్లు పొదుపు లక్ష్మి మహిళా ఐక్య సంఘం కోశాధికారి విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శి పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-31T05:45:35+05:30 IST