Share News

కళ తప్పిన జల జీవనం

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:42 AM

మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

కళ తప్పిన జల జీవనం
ట్యాంకు వద్ద పడిపోయిన జల్‌జీవన్‌ మిషన్‌ బోర్డు

నత్తనడకన తాగునీటి పథకం పనులు.. ఏజెన్సీలో దాహం కేకలు

ట్యాంకులు నిర్మించి ఏడాది గడిచినా ఏర్పాటు కాని బోర్లు

పట్టించుకోని అధికారులు

జీలుగుమిల్లి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టాయి. 2.0(జెజెఎం 2.0)లో భాగంగా 2028 డిసెంబరు నాటికి ప్రతీ ఇంటికి నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ప్రస్తుతం పఽథకం అమలుకు నోచుకోక పలు గిరిజన గ్రామాల్లో పేద ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా మండలంలో పలు గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ పఽథకం ద్వారా రూ.3.87 కోట్లతో జీలుగుమిల్లి, చిర్రివారి గూడెం, మధ్యబర్రింకలపాడు, పి.రాజవరం, మడకంవారిగూడెం, పి.అంకంపాలెం, ముల గలంపల్లి, అంకన్నగూడెం, గోపాలపురం, రౌతుగూడెం గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆయా గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. ఏడాది కావస్తున్నా రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద బోరు మోటార్లు ఏర్పాటు చేయలేదు. దీంతో కొన్నిచోట్ల ట్యాంకుల్లోకి దిగి ఆకతాయిలు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరోవైపు పఽథకం జీలుగుమిల్లిలో ట్యాంకు నిర్మాణం చేసిన చోట ఏర్పాటు చేసిన జల్‌జీవన్‌ మిషన్‌ బోర్డు నేలకు ఒరిగింది. కొన్నిచోట్ల ఏర్పాటు చేసిన బోరు పైపులో కొందరు రాళ్లు వేస్తున్నారు. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో పథకం అమలుకు నోచకోక ట్యాంకుల వద్ద ఉంచిన నిర్మాణ సామగ్రి అపహరణకు గురవు తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అఽధికారులను వివరణ కోరేం దుకు ప్రయత్నించగా ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం వేసవి వాతావరణం తలపిస్తుండడంతో పథకం అమలు చేసి మంచినీటి ట్యాంకులు ప్రారంభిస్తే తాగునీటి కొరత సమస్య పరిష్కారమవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:42 AM