Share News

రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:17 AM

Jee exams ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌ కోర్సుకు సంబంధించి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరేందుకుగాను జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్స్‌ తొలి సెషన్‌ పరీక్షలు ఈ నెల 21 నుంచి 29 వరకు జరగనున్నాయి.

రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌
నరసనన్నపేటలోని కోర్‌ టెక్నాలజీ కేంద్రం

  • పరీక్ష సమయానికి 2 గంటలు ముందుగానే అనుమతి

  • నరసన్నపేట, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌ కోర్సుకు సంబంధించి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరేందుకుగాను జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్స్‌ తొలి సెషన్‌ పరీక్షలు ఈ నెల 21 నుంచి 29 వరకు జరగనున్నాయి. 26 మినహా మిగిలిన తేదీల్లో రెండు షిఫ్ట్‌ల్లో పేపర్‌-1(బీఈ, బీటెక్‌) ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. 29న మధ్యాహ్నం పేపర్‌-2 బీఆర్క్‌ పరీక్ష జరగనుంది. నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనున్నారు. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీ(బైపాస్‌ రోడ్డులో గొట్టిపల్లి అండర్‌ పాసేజ్‌ వంతెన పక్కన) కేంద్రంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జిల్లాలో సుమారు 11వేల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది అభ్యర్థులు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి తదితర పట్టణాల్లో పరీక్షలు రాయనున్నారు.

  • మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షా సమయానికి అరగంట ముందు వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు.

  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఆధార్‌ లేదా పాన్‌ తదితర ఒరిజనల్‌ కార్డును విధిగా తీసుకువెళ్లాలి. సాధారణ వస్త్రాలను ధరించాలి. కాళ్లకు బూట్లు, తలపై పిన్నులు, క్లిప్పులు అనుమతించరు. ఆభరణాలు ధరించరాదని ఎన్‌టీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. అబ్బాయిలు పెద్దపెద్ద గుండీలు ఉన్న షర్టులు ధరించరాదని స్పష్టం చేసింది.

Updated Date - Jan 20 , 2026 | 12:17 AM