ఎంటీఎస్ టీచర్ల కొనసాగింపు
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:03 AM
మినిమం టైం స్కేలు (ఎంటీఎస్)తో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న డీఎస్సీ-98, డీఎస్సీ-2008 టీచర్ల సర్వీసులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు.
పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు
ఒంగోలు విద్య, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : మినిమం టైం స్కేలు (ఎంటీఎస్)తో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న డీఎస్సీ-98, డీఎస్సీ-2008 టీచర్ల సర్వీసులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంట్రాక్టు 2026 ఏప్రిల్ 30తో ముగియడంతో వారిని తొలగించారు. వేసవి సెలవుల అనంతరం ఈనెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో వీరి సేవలు పాఠశాలలకు అవసరమని గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. 2026-27 విద్యా సంవత్సరానికి జూన్ 1 నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు వీరి సేవలను కొనసాగిస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 214 మంది ఎంటీఎస్ కాంట్రాక్టు టీచర్లు తిరిగి విధుల్లో చేరనున్నారు.