Share News

జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:58 PM

జగన్‌రెడ్డి మీడియా ముందు మాట్లాడడం కాదు. నీకు దమ్ముంటే రైతులపై చర్చించడానికి అసెంబ్లీకి రావాలి.’ అని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

 జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

- మీ ఐదేళ్ల పాలనకు.. మా 16 నెలల పాలనకు తేడా చూపిస్తాం

- కిష్టుపురం సభలో మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌రెడ్డి మీడియా ముందు మాట్లాడడం కాదు. నీకు దమ్ముంటే రైతులపై చర్చించడానికి అసెంబ్లీకి రావాలి.’ అని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. మంగళవారం కిష్టుపురం గ్రామంలో రూ.28.50లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.40లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. ‘మొంథా తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ అధికారులు, ప్రజ్రాపతినిధులను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం లేకుండా చేశారు. తుఫాన్‌ సమయంలో బెంగళూరులో ఉన్న జగన్‌రెడ్డి ఇప్పుడు రైతులు వద్దకు వచ్చి సొల్లు కబుర్లు చెబుతున్నారు. మీ ఐదేళ్ల పాలనలో.. మా 16నెలల పాలనలో రైతులకు చేసిన మేలుపై చర్చించడానికి నీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. కాశీబుగ్గ వేంకటేశ్వస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 9 మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15లక్షలు చొప్పున, కేంద్ర ప్రభుత్వం రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాయి. టెక్కలి నియోజకవర్గానికి చెందిన ముగ్గురి మృతులకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో వారి కుటుంబాలకు అదనంగా మరో రూ.5లక్షలు అందజేశాం. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండటంతో ఏ రాష్ట్రంలో ప్రమాదం జరిగిన అందులో ఈ మూడు జిల్లాల వారు తప్పనిసరిగా ఉంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఉత్తరాంధ్రలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ఇక్కడ ప్రజలు సహకరించాలి. గత ఐదేళ్లలో కిష్టుపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల్లో రూ.2కోట్లు వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేశాం. మరో ఆరు నెలల్లో వంశధార రిజర్వాయర్‌ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 7వేలు వేశాం. ఈ వారంలో మరో రూ.7వేలు, డిసెంబరులో మిగతా రూ. 6వేలు జమచేస్తాం.’అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు వెలమల విజయలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, నాయకులు కామేశ్వరరావు, రామకృష్ణ, కర్రి అప్పారావు, సాసుమంతు ఆనంద్‌, బాడాన చిన్నారావు, ముత్తురాజు, నంబాళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:58 PM