Share News

ఆ సొమ్ము పోయినట్లేనా?

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:56 PM

పాలనా సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు స్థానిక స్వపరిపాలన సంస్థల నడ్డి విరుస్తున్నాయి.

ఆ సొమ్ము పోయినట్లేనా?

జడ్పీకి రావాల్సిన రూ.4.38 కోట్ల సర్‌చార్జీపై అనుమానం

గతంలో నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ

సీఎఫ్‌ఎంఎస్‌ వచ్చాక రాష్ట్రం చేతుల్లోకి

అక్కడ నుంచి రావడం ఇక గగనమే

కర్నూలు న్యూసిటీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాలనా సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు స్థానిక స్వపరిపాలన సంస్థల నడ్డి విరుస్తున్నాయి. ఒకప్పుడు నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ అయ్యే సర్‌చార్జీలపై కూడ సీఎఫ్‌ఎంఎస్‌(సెంట్రల్‌ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)కు వెళ్లడం పెనుశాపంగా పరిణమించింది. జగన్‌ జమానాలో సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లిన నిధులు తిరిగి స్థానిక సంస్థలకు రాకపోవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్‌కు రూ.4.38 కోట్లు నష్టపోవాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుత ప్రభుత్వం అయినా ఆ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చూపుతుందన్న ఆశ రోజు రోజుకూ అడుగంటుతోంది.

గతంలో చెల్లింపులు స్థానికంగానే..

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్‌కు ప్రధాన ఆదాయ వనరుల్లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి వచ్చే సర్‌చార్జీ(ట్రాన్సఫర్‌ డ్యూటీ) అత్యంత ప్రధానమైంది. గతంలో ఈ చెల్లింపులు స్థానికం గానే జరిగేవి. కాబట్టి పెద్దగా పెండింగ్‌ ఉండేది కావు. సీఎఫ్‌ఎంఎస్‌ వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. రిజిస్ట్రేషన్‌ చేయిం చుకున్న వారి వద్ద నుంచి వసూలు చేసు సర్‌చార్జి నేరుగా సీఎఫ్‌ ఎంఎస్‌కు వెళ్తుంది. దానిని ఆర్థికశాఖ అధికారులు పరిశీలించి విడుదల చేయాలి. 2014-2019 మధ్యకాలంలో ఆ చెల్లింపులు సక్ర మంగానే జరిగాయి. 2019లో ప్రభుత్వం మారిన తరువాత సీఎఫ్‌ ఎంఎస్‌కు వెళ్లిన సర్‌చార్జీలను కూడ ప్రభుత్వం వాడుకోవడం ఆరం భించింది. ఆ సొమ్ము స్థానిక సంస్థలకు విడుదల చేయటానికి ప్రభు త్వం ఇబ్బంది పెడుతోంది. ఆ రకంగా కర్నూలు జిల్లా పరిషత్‌కు రావాల్సిన సర్‌చార్జి రూ. కోట్లలో పేరుకుపోయింది. కూటమి ప్రభుత్వం కూడా గడిచిన 17 నెలలుగా ఆ ఊసే ఎత్తటం లేదు.

రావాల్సింది రూ.4.38 కోట్లు

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్‌కు సర్‌చార్జి రూపేణా రావాల్సిన సొమ్ము వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా నుంచి 2018-2019 - 2024-2025 వరకు రూ. 1,58.87,748, కర్నూలు జిల్లా నుంచి 2018-2019 - 2024-2025 వరకు రూ.2,19,39,717 రావాల్సి ఉంది. మొత్తం 4,38,27,465 సర్‌చార్జి సొమ్ము రావాల్సి ఉందని జిల్లా పరిషత్‌ అధికారులు చెబుతున్నారు.

చట్టపరంగా నిధులు పంపాలని కోరుతున్నాం...

జిల్లా రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి రావాల్సిన సర్‌చార్జీలు చట్టపరంగా పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం. ఇప్పటికే పలుమార్లు చెప్పాం. త్వరలోనే పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లిన వెంటనే స్థానిక సంస్థల ఖాతాల్లో జమ అవుతాయి.

-జి. నాసరరెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈఓ

Updated Date - Nov 04 , 2025 | 10:56 PM