Share News

యాంటీబయాటిక్స్‌తో జాగ్రత్త

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:18 PM

యాంటీ బయాటిక్స్‌ను పరిమితికి మించి వాడరాదని, వైద్యుల ప్రిస్కిప్షన్లు లేకుండా మందులు అమ్మరాదని కలెక్టర్‌ సిరి హెచ్చరించారు.

యాంటీబయాటిక్స్‌తో జాగ్రత్త
డ్రగ్‌ కంట్రోల్‌ ఆఫీసును ప్రారంభిస్తున్న కలెక్టర్‌, పాణ్యం ఎమ్మెల్యే

కలెక్టర్‌ డా. సిరి

పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం- ఎమ్మెల్యే గౌరు చరిత

రూ.2.78 కోట్లతో డ్రగ్‌ కంట్రోల్‌ ఆఫీస్‌, ల్యాబ్‌ ప్రారంభం

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): యాంటీ బయాటిక్స్‌ను పరిమితికి మించి వాడరాదని, వైద్యుల ప్రిస్కిప్షన్లు లేకుండా మందులు అమ్మరాదని కలెక్టర్‌ సిరి హెచ్చరించారు. మంగళవారం విజయవాడ నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కర్నూలు, విశాఖపట్నం రీజనల్‌ లేబొరేటరీలు, డిప్యూటీ డైరెక్టర్‌ ఏడీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సమీపంలో నూతనంగా రూ.2.78 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన డిప్యూటీ డైరెక్టర్‌, జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ ఆఫీస్‌ రీజనల్‌ లేబొరేటరీ భవనాలను కలెక్టర్‌ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ ఔషధ దుకాణాల యజమానులతో మాట్లాడుతూ నకిలీ, కాలం చెల్లిన మందులను అమ్మరాదని సూచించారు. యాంటీ బయాటిక్స్‌ను అధిక మోతాదులో ప్రజలు వాడుతున్నారని, దీని వల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి ఇతర రోగాల బారిన పడుతున్నారన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యా నికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నదన్నారు. అందులో భాగంగా పేద ప్రజలకు రూ.25 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నదన్నారు. ప్రతి అనారోగ్య సమస్యకు మందులు వాడకుండా, ప్రకృతిపరంగా జబ్బును నయం చేసుకోవడం మంచిదన్నారు. అనంతరం రీజనల్‌ ల్యాబ్‌ను కలెక్టర్‌, పాణ్యం ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఔషధ నియంత్రణ పరిపాలన డిప్యూటీ డైరెక్టర్‌ నాగ కిరణ్‌ కుమార్‌, జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హరిహరతేజ, డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌, డీసీహెచ్‌ఎస్‌ డా.జఫ్రుల్లా, డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు హనుమన్న, జయరాముడు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:18 PM