అటా.. ఇటా?
ABN, Publish Date - Dec 30 , 2024 | 05:30 AM
ఓవైపు నితీశ్ తన శతక పోరాటంతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ను పోటీలోకి తీసుకురాగా.. మరోవైపు 105 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసీ్సకు మన పేస్ త్రయం పదునైన బంతులతో ముకుతాడు వేసింది...
లబుషేన్ అర్ధసెంచరీ
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 228/9
ప్రస్తుత ఆధిక్యం 333
బుమ్రాకు నాలుగు వికెట్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ 369
200 వికెట్ల క్లబ్లో జస్ప్రీత్
ఓవైపు నితీశ్ తన శతక పోరాటంతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ను పోటీలోకి తీసుకురాగా.. మరోవైపు 105 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసీ్సకు మన పేస్ త్రయం పదునైన బంతులతో ముకుతాడు వేసింది. ఫలితంగా ఆ జట్టురెండో ఇన్నింగ్స్లో 91 రన్స్కే 6 వికెట్లను కోల్పోయింది. ఇక మిగిలిన వికెట్లు తీయడం ఎంతసేపు.. భారత్ ముందు ఓ మాదిరి ఛేదనే ఉండొచ్చు? అని అనుకున్న వేళ
లబుషేన్-కమిన్స్ పోరాట బాధ్యతను
టెయిలెండర్లు తీసుకున్నారు. లియోన్-
బోలాండ్ ఆఖరి వికెట్కు అజేయంగా 55 రన్స్ జోడించి బుమ్రా బృందానికి చుక్కలు చూపించారు. దీనికి తోడు మన ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఆసీ్సకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఆఖరి రోజు ఆటపై అంతటా ఆసక్తి నెలకొంది.
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టు రసకందాయంలో పడింది. నాలుగో రోజు ఆదివారం భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనకు.. ఆసీస్ టెయిలెండర్ల పోరాటానికి మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈకారణంగా ఆఖరి రోజు సోమవారం ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడే పరిస్థితి నెలకొంది. చివరి వరుస బ్యాటర్లు లియోన్ (41 బ్యాటింగ్), బోలాండ్ (10 బ్యాటింగ్) మొండిగా క్రీజులో నిలవడంతో ఆతిథ్య జట్టు ఇప్పటికే 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుండడంతో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయకుండా కొనసాగించింది. దీంతో ప్రస్తుతం 9 వికెట్లకు 228 పరుగులతో నిలిచింది. లబుషేన్ (70) అర్ధసెంచరీ సాధించగా, కమిన్స్ (41) అండగా నిలిచాడు. బుమ్రాకు నాలుగు, సిరాజ్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు 358/9 ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన భారత్ పోరాటం 21 బంతుల్లోనే ముగిసింది. సెంచరీ హీరో నితీశ్ (114)ను లియోన్ అవుట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌటైంది. బోలాండ్, కమిన్స్, లియోన్లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఒకవేళ భారత్ ముంగిట 350 పరుగుల లక్ష్యమేర్పడితే రోజంతా దీటుగా ఆడి చరిత్రాత్మక విజయంపై కన్నేస్తుందా? లేక డ్రా కోసం ఆడుతుందా? అనేది నేడు చూడాల్సిందే.
కాన్స్టా్సపై ప్రతీకారం: 105 పరుగుల ఆధిక్యంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించగా.. పేసర్ బుమ్రా వారినేమాత్రం కుదురుకోనీయలేదు. అతడికి తోడు సిరాజ్, ఆకాశ్ సైతం కట్టుదిట్టమైన బంతులతో దాడికి దిగారు. దీంతో ఆసీస్ పరుగుల వేటలో వెనుకబడి వికెట్లను కోల్పోయింది. అయితే జైస్వాల్ మూడు క్యాచ్లను వదిలేయడం ఆసీ్సకు బాగా కలిసివచ్చింది. లేకుంటే ఈపాటికి భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభమయ్యేది. ముందుగా అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ బాదిన ఓపెనర్ కాన్స్టాస్ (8)పై ఈసారి బుమ్రా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏడో ఓవర్లో అతడి లెంగ్త్ బాల్.. సామ్ బ్యాట్, పాడ్ మధ్య నుంచి వెళ్లి మిడ్ వికెట్ను ఎగరగొట్టింది. దీంతో బుమ్రా ప్రేక్షకుల వైపు చూస్తూ ఇంకా అరవండి అంటూ సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. అటు సిరాజ్ ఈసారి క్రమశిక్షణగా బౌలింగ్ చేస్తూ ఖవాజా (21), స్మిత్ (13) వికెట్లను తీశాడు. మరోవైపు వన్డౌన్ బ్యాటర్ లబుషేన్ మాత్రం పట్టుదలగా క్రీజులో నిలిచాడు. మరో ఎండ్లో బుమ్రా వికెట్ల వేట మాత్రం ఆగలేదు. 34వ ఓవర్లో హెడ్ (1), మార్ష్ (0)లతో పాటు తన తర్వాతి ఓవర్లో క్యారీ (2)ని అవుట్ చేయడంతో ఆసీస్ 91/6 స్కోరుతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో 150 రన్స్ చేయడం కూడా కష్టమే అనిపించింది. కానీ లబుషేన్కు కెప్టెన్ కమిన్స్ జత కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. మరోవైపు ఈ ఇద్దరి క్యాచ్లను జైస్వాల్ వదిలేశాడు. ఆ తర్వాత లబుషేన్ అర్ధసెంచరీ పూర్తి చేయడంతో పాటు కమిన్స్తో కలిసి ఏడో వికెట్కు 57 పరుగులు జోడించాడు. చివరి సెషన్లో లబుషేన్ను సిరాజ్ ఎల్బీ చేసి జట్టుకు ఉపమశమనం కలిగించాడు. ఆ తర్వాత కాసేపటికే స్టార్క్ (5) రనౌట్ కాగా కమిన్స్ను జడేజా పెవిలియన్కు చేర్చాడు.
చివర్లో పోరాటం: ఆసీస్ స్కోరు 173/9 దగ్గర వారి ఆధిక్యం 278 పరుగులు. క్రీజులో ఉన్నది లియోన్, బోలాండ్. దీంతో చివరి వికెట్ తీయడం ఎంతో సేపు పట్టదన్న అంచనాలో భారత్ ముందు 300 పరుగుల్లోపే లక్ష్యం ఉంటుందని అంతా భావించారు. కానీ ఈ ‘తోక’ జోడీ బౌలర్లకు చుక్కలు చూపించింది. వారెంత ప్రయత్నించినా నాలుగో రోజు ఆసీ్సను ఆలౌట్ చేయలేకపోయింది. లియోన్ 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్ అతడి రిటర్న్ క్యాచ్ను వదిలేశాడు. ఆ చాన్స్ను వినియోగించుకుంటూ చూస్తుండగానే ఆధిక్యాన్ని 300కు చేర్చాడు. ఇప్పటికే ఈ జోడీ పదో వికెట్కు అజేయంగా 55 పరుగులు జోడించగా.. సంయుక్తంగా 119 బంతులను ఎదుర్కోవడం విశేషం.
స్కోరుబోర్డు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 474;
భారత్ తొలి ఇన్నింగ్స్: 369
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: కాన్స్టా్స (బి) బుమ్రా 8; ఖవాజా (బి) సిరాజ్ 21; లబుషేన్ (ఎల్బీ) సిరాజ్ 70; స్మిత్ (సి) పంత్ (బి) సిరాజ్ 13; హెడ్ (సి) నితీశ్ (బి) బుమ్రా 1; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 0; క్యారీ (బి) బుమ్రా 2; కమిన్స్ (సి) రోహిత్ (బి) జడేజా 41; స్టార్క్ (రనౌట్) 5; లియోన్ (బ్యాటింగ్) 41; బోలాండ్ (బ్యాటింగ్) 10; ఎక్స్ట్రాలు: 16; మొత్తం: 82 ఓవర్లలో 228/9. వికెట్ల పతనం: 1-20, 2-43, 3-80, 4-85, 5-85, 6-91, 7-148, 8-156, 9-173. బౌలింగ్: బుమ్రా 24-7-56-4; ఆకాశ్ 17-4-53-0; సిరాజ్ 22-4-66-3; జడేజా 14-2-33-1; నితీశ్ 1-0-4-0; సుందర్ 4-0-7-0.
మూడు క్యాచ్లు వదిలేసిన జైస్వాల్
ఆదివారం ఆటలో యువ బ్యాటర్ జైస్వాల్ను దురదృష్టం వెంటాడింది. అతడెక్కడ ఉంటే అక్కడికి క్యాచ్లు రాగా, వచ్చిన మూడింటినీ అతను నేలపాలు చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఖవాజా క్యాచ్ను గల్లీలో ఉన్న జైస్వాల్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత అదే స్థానంలో లబుషేన్ ఇచ్చిన క్యాచ్ను కూడా పట్టలేకపోయాడు. కమిన్స్ 20 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్ను సిల్లీ పాయింట్లో ఉండి చేజార్చాడు. వీటన్నింటిని చూస్తూ తీవ్ర అసంతృప్తికి గురైన కెప్టెన్ రోహిత్ అతడికి కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు. అయితే కెప్టెన్ ప్రవర్తన సరిగ్గా లేదని, క్యాచ్లను ఎవరూ కావాలని వదిలేయరని వ్యాఖ్యాత మైక్ హస్సీ స్పందించాడు. ఈ సమయంలోనే అతడిని ప్రోత్సహించాల్సిందిగా సూచించాడు.
1
అతి తక్కువ సగటు (19.38)తో టెస్టుల్లో 200 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా బుమ్రా. 44 మ్యాచ్ల్లో తను మొత్తంగా 202 వికెట్లు తీశాడు. అలాగే ఆసీస్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ వికెట్లు (75) తీసిన భారత బౌలర్గా కపిల్ (72)ను అధిగమించాడు.
2
టెస్టుల్లో భారత్ తరపున వేగం (44 టెస్టుల్లో)గా 200 వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్గా జడేజా సరసన నిలిచిన బుమ్రా. అశ్విన్ (37 టెస్టుల్లో) ముందున్నాడు.
2
ఆసీస్ గడ్డపై 8 అంతకంటే తక్కువ స్థానాల్లో వచ్చి ఎక్కువ స్కోరు (114) సాధించిన రెండో పర్యాటక జట్టు బ్యాటర్గా నితీశ్. మ్యాట్ ప్రియర్ (118, ఇంగ్లండ్) ముందున్నాడు.
Updated Date - Dec 30 , 2024 | 05:30 AM