బొక్కల కంపెనీ మూసేదాకా ఆందోళన
ABN , First Publish Date - 2023-02-06T23:51:04+05:30 IST
మండలంలోని తక్కళ్లపల్లి-కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీ మూసేదాకా ఆందోళన చేస్తామని కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పు బాషాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం నేతలు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
యాచారం, ఫిబ్రవరి 6: మండలంలోని తక్కళ్లపల్లి-కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీ మూసేదాకా ఆందోళన చేస్తామని కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పు బాషాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బొక్కల కంపెనీ మూసివేయాలని ఆయా గ్రామాల రైతులు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీజేఎస్ పార్టీల కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బొక్కల కంపెనీ అనుమతులను పునరుద్దరించకుండా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సుచరితకు అందజేశారు. ఈ ధర్నాలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, టీజేఎస్ నియోజకవర్గ కన్వీనర్ నిరంజన్, సీపీఎం నాయకులు నానక్నగర్, సర్పంచ్ పెద్దయ్య, సీపీఎం మండల కమిటీ సభ్యుడు జంగయ్య, సంతోష, ఎండీ హబీబొద్దీన్ కె.జగన్, శ్రీశైలం, దూస రమేష్ పాల్గొన్నారు. కాగా మండల కాంప్లెక్స్ ఆవరణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బొక్కలకంపెనీ ఎదుట తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల రైతుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షకు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సంఘీభావం తెలిపారు.